Dhoni: కొత్త సీజన్‌.. కొత్త రోల్‌.. ధోనీ పోస్ట్‌ వైరల్..!

Dhoni: IPL 2024కు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ కొత్త చర్చకు తెరలేపాడు. కొత్త సీజన్‌, కొత్త రోల్‌ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు మహీ. దీంతో ధోనీ ఈ సీజన్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడా? మెంటార్‌గా మారనున్నాడా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ధోనీ పోస్టుపై చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కూడా స్పందించింది.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 మరో సుమారుగా మరో రెండు వారాల్లో ప్రారంభం కానుంది. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్‌ – రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. అయితే సీజన్‌ ప్రారంభానికి ముందే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌ కింగ్స్‌.. షాక్‌ ఇవ్వనుందా? సీఎస్కే కెప్టెన్‌ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్‌ ధోనీ తప్పుకోనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

IPL 2024 సీజన్ ప్రారంభానికి ముందు టీమిండియా మాజీ కెప్టెన్, CSK సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ చేసిన ఓ సోషల్ మీడియా పోస్టు కొత్త చర్చకు తెరలేపింది. వాస్తవంగా సోషల్‌ మీడియాకు దూరంగా ఉండే కెప్టెన్ కూల్.. సోమవారం ఫేస్‌బుక్‌ వేదికగా ఓ పోస్టు చేశాడు. అందులో “కొత్త సీజన్‌.. కొత్త రోల్‌ కోసం ఎదురుచూస్తున్నా, వెయిట్‌ చేయండి” అని రాసుకొచ్చాడు. సోషల్‌ మీడియాకు దూరంగా ఉండో ధోనీ న్యూరోల్‌ అంటూ పోస్టు చేయడంపై సీఎస్కే ఫ్యాన్స్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ ఫ్యాన్స్‌.. రకరకాలుగా ఊహించుకుంటున్నారు. (Dhoni)

తన బుర్రలోని ఆలోచనలతో ప్రత్యర్థి ఆటగాళ్ల మైండ్‌ను చదివే ధోనీ చేసిన పోస్టు.. ప్రస్తుతం ఫ్యాన్స్‌ను తెగ ఆలోచించేలా చేస్తోంది. కొందరేమో ఈ ఏడాది మెంటార్‌ కమ్ కోచ్‌గా ధోనీ కన్పించబోతున్నాడని పేర్కొంటున్నారు. మరి కొందరేమో మహీ కెప్టెన్సీ వదిలేసి కేవలం ఆటగాడిగా మాత్రమే ఉంటాడని విశ్లేషించుకుంటున్నారు. ఇక కెప్టెన్ కూల్‌ పోస్టుపై చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యం సైతం స్పందించింది. కొత్త పాత్రలో లియో ధోనీ అని ఆలోచిస్తున్నట్లుగా ఉన్న ఫొటో షేర్‌ చేసింది. దీంతో చర్చను మరింత పెంచింది.

మరికొందరేమో.. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టి ఫ్యాన్స్‌ను తికమక పెట్టడం ధోనీకి అలవాటే అని పేర్కొంటున్నారు. 2021 టీ20 ప్రపంచకప్‌కు కొద్దిరోజుల ముందు మహీ.. ఓ ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌ వినబోతున్నారని ఫేస్‌బుక్‌లో ప్రకటించాడని చెబుతున్నారు. అంతా ఆసక్తిగా ఎదురుచూస్తే ఓ బిస్కట్స్‌ను ప్రమోట్‌ చేశాడని గుర్తు చేస్తున్నారు. మరి తాజాగా ధోనీ చేసిన పోస్టు అర్థం ఏంటి అనేది తేలాలంటే.. మార్చి 22 వరకు వెయిట్‌ చేయాల్సిందే.

ఇక, ధోనీ తన అంతర్జాతీయ కెరీర్‌లో (టెస్ట్ + వన్డే + టీ20) మొత్తం 332 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. కెప్టెన్‌గా ఇదే అత్యధికం. రికీ పాంటింగ్ 324 మ్యాచ్‌లలో ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించాడు. ఈ 332 మ్యాచ్‌ల్లో ధోనీ 178 మ్యాచ్‌లు గెలిచి 120 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. 6 మ్యాచ్‌లు టై కాగా 15 డ్రా అయ్యాయి. మహీ 90 టెస్టుల్లో 4876 పరుగులు, 350 వన్డేల్లో 10773 పరుగులు, 98 టీ20ల్లో 1617 పరుగులు చేశాడు. 250 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి ధోని 5082 పరుగులు చేశాడు. ఇందులో 142 క్యాచ్‌లు, 42 స్టంప్‌లు కూడా అతని పేరిట ఉన్నాయి.