Pawan Kalyan: నేనంటే ప‌డిచ‌చ్చే వాళ్లు.. ఆయ‌న్ని తిడుతున్నారు

AP: పొత్తుల‌తోనే 2024 ఎన్నిక‌ల్లో(ap elections) పోటీ చేస్తాన‌ని అన్నారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్‌(pawan kalyan). మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో జ‌న‌సేన అధికారుల‌తో ప‌వ‌న్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..

“జనం మధ్యనే కూర్చొని కామన్ మినిమమ్ ప్రొగ్రాం రూపొందిస్తాం. జనసేనలో ఉండేవాళ్లకే నేను బాధ్యతలు ఇస్తాను. ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయే వాళ్లకి నేను బాధ్యతలు ఇవ్వను. పార్టీలో నాదెండ్లను చాలా మంది విమర్శిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. పార్టీలో అనుకూల శత్రువులుగా మారొద్దు. అనుకూల శత్రువులు ఎవరైనా ఉంటే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేస్తా. మనోహర్ ఏ రోజూ నన్ను సంప్రదించకుండా ఏం మాట్లాడరు. నాదెండ్ల లాంటి వ్యక్తిని గుండెల్లో పెట్టుకోవాలి.. కానీ తూలనాడొద్దు. నేను అంటే పడి చచ్చిపోతామనే వాళ్లు.. నాదెండ్లను విమర్శిస్తున్నారు. ఇలాంటి వాళ్లను నేను వైసీపీ కోవర్టులుగానే భావిస్తాను. నా మీద కోపాన్ని నాదెండ్ల మీద చూపుతున్నారు”

“ఏదైనా ఉంటే నా మీదే కోప్పడండి.. నన్నే విమర్శించండి. వ్యాపారస్తులను బెదిరించవద్దు. నాకు కంప్లైంట్లు రాకూడదు. నేను సీఎం కావాలంటే.. నన్ను గౌరప్రదమైన స్థానంలో కూర్చొబెట్టాలి. 48-50 శాతం ఓట్లు జనసేనకు ఇవ్వండి.. సీఎం సీటు అడుగుదాం. జగన్ పచ్చని చెట్లను కొట్టేసే వ్యక్తి. ఏ కులానికి న్యాయం చేశాడు? ప్రతి కులానికి అన్యాయం చేసిన వ్యక్తి జగన్. జగన్ ఏపీ వ్యతిరేక వ్యక్తి. అడ్డగోలుగా సంపాదించిన వ్యక్తి జగన్. మరోసారి జగన్ సీఎం అయితే ఏపీ మళ్లీ కోలుకోదు. మన ఓటింగ్ శాతం పెరిగింది.. కానీ ఈ ఓటింగుతో ప్రభుత్వాన్ని స్థాపించలేం. కచ్చితంగా జనసేన-టీడీపీ-బీజేపీ పోత్తుతోనే ఎన్నికలకు వెళ్తాం. సీఎం అభ్యర్థి ఎవరనేది ఎన్నికలయ్యాక తేలుతుంది. సీఎం అభ్యర్థి ఎవరనేది ముఖ్యం కాదు.. ఈ సీఎం ఉండకూడదనేదే ముఖ్యం. పొత్తు ఖరారై.. విధి విధానాలు ఓకే అయితే కామన్ మినిమమ్ ప్రొగ్రాం సెట్ చేస్తాం” అన్నారు.