KTR: నిరోధ్‌లు అమ్ముకోవాల‌ట‌.. అలా మాట్లాడితే ఊరుకుంటారా?

ECI is scared of narendra modi says ktr

కాంగ్రెస్ నేత‌లు నిరోధ్‌లు, అప్ప‌డాలు అమ్ముకోండి అని మాట్లాడుతున్నార‌ని.. వారికి బుద్ధి చెప్పేందుకు KCR ఒక చిన్న మాట అంటే దానికే నోటీసులు ఇచ్చేస్తారా అని కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని ప్ర‌శ్నించారు భార‌త రాష్ట్ర స‌మితి వర్కింగ్ ప్రెసిడెంట్ KTR.

ఎన్నికల కమిషన్ బీజేపీ కనుసన్నులో నడుస్తోంది. మేము స్పష్టంగా ఆరోపణలు చేస్తున్నాం. జాతులు, మతాల ఆధారంగా స్వయంగా ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా దారుణంగా వ్యాఖ్యలు చేసినా వారిపై చర్యల్లేవ్. బీజేపీ సోషల్ మీడియాలో ముస్లింలపై డైరెక్ట్‌గా విషం చిమ్ముతూ పోస్ట్‌లు చేస్తున్నారు. మోడీ డైరెక్ట్ గా ముస్లింలే ఎక్కువ మంది పిల్లలను కంటారని ఇష్టానురీతిగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై దాదాపు 20 వేల కంప్లైంట్స్ వచ్చాయి. కనీసం మోడీకి నోటీసులు కూడా ఇవ్వలేదు. మోడీకి భయపడి బీజేపీఅధ్యక్షుడు నడ్డాకి ఈసీ నోటీసులు ఇచ్చింది.

ఎన్నికల్లో అమిత్ షా దేవుడి ఫోటో పెట్టుకొని ప్రచారం చేస్తే ఆయనపై చర్యల్లేవ్. బీజేపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో రాముడి ఫోటో పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు. ప్రధాని మోడీ విద్వేష వ్యాఖ్యలు చేసిన, అమిత్ షా దేవుని ఫోటోలు పెట్టుకొని ఓట్లు అడిగిన ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోదు. కానీ కేసీఆర్ విషయంలో మాత్రం…ఆగమేఘాల మీద నోటీసులు ఇచ్చారు. సిరిసిల్లలో జరిగిన ప్రెస్ మీట్ కేసీఆర్ గారు కాలం తెచ్చిన కరువు కాదు. కాంగ్రెస్ తెచ్చిన కరువు అన్నారు.

బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వటం లేదని నేతన్నలు ఆవేదనతో చెబితే కేసీఆర్ గారు దానిపై స్పందించారు. నిరోధ్ లు, అప్పడాలు అమ్ముకోవాలని ఒక దుర్మార్గుడు అంటే దాన్ని ఖండిస్తూ కొంచెం కఠిన పదం వాడారు. దీనిపై చర్యలు తీసుకున్నారు. మరి రేవంత్ రెడ్డి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు. రేవంత్ రెడ్డిపై మేము ఎన్ని ఫిర్యాదులు చేసిన ఈసీ పట్టించుకోలేదు. తుక్కుగూడ సభలో రేవంత్ రెడ్డి చాలా అధ్వాన్నంగా మాట్లాడారు.

రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు నీతి సూక్తులు, ప్రవచనాలు, సుభాషితాలా? రేవంత్ రెడ్డి మీద 8 సహా మొత్తం 27 కంప్లైంట్లు చేశాం. ఒక్క దానిపై యాక్షన్ లేదు. ఒక్క మంత్రి కొండా సురేఖని మందలించారంతే. కేసీఆర్ గారి సభలకు వస్తున్న స్పందన చూసి కాంగ్రెస్, బీజేపీలకు దడ పుట్టింది. చోటాభాయ్, బడా భాయ్ మోసాలను రోడ్ షో లలో కేసీఆర్ ప్రజలకు పూస గుచ్చినట్లు వివరించారు. కేసీఆర్ సభలకు వస్తున్న స్పందన, 12 సీట్లు బీఆర్ఎస్ కు రావచ్చునని సర్వే రిపోర్టులు చూసి బడేభాయ్, చోట భాయ్ భయపడ్డారు.

కచ్చితంగా కాంగ్రెస్, బీజేపీ కుట్రలకు ఓటు ద్వారానే జవాబు చెప్పాలని ప్రజలను కోరుతున్నా. ఎన్నిసార్లు మేము ఈసీకి ఫిర్యాదు చేసిన గోడకు చెప్పుకున్నట్లే ఉంది. మోడీ, నడ్డా, రేవంత్ రెడ్డి లకు నోటీసులు ఇవ్వటానికి ఈసీ ఎందుకు భయపడుతోంది. కేసీఆర్ పై ఫిర్యాదు వస్తే మాత్రం ఆగమేఘాల మీద చర్యలు తీసుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణులు, బూతులు ఉన్నాయి. అయిన పట్టించుకోవటం లేదు.

రాజ్యాంగం ఇచ్చిన స్వయంప్రతి పత్తిని అపహాస్యం చేసేలా ఈసీ వ్యవహరిస్తోంది. నా మాటలు తప్పు అయితే మోడీకి నోటీసులు ఎందుకు ఇవ్వటం లేదో చెప్పాలి. ఈసీ ఎన్నికలను పార‌ద‌ర్శ‌కంగా నిర్వహిస్తామని మాటలకే పరిమితమైంది. మేము ప్రచారం చేయటాన్ని అడ్డుకొని మా ప్రత్యర్థులను మాత్రం అచ్చొసిన అంబోతులను వదిలేసినట్లు వదిలేశారు. మార్చి 18న ఓయూలో నీటి కొరత, కరెంట్ సమస్య ఉందంటూ నెల సెలవులు ఇస్తున్నామని ఒక నోటీసు ఇవ్వటం జరిగింది.

దీన్ని వ్యతిరేకిస్తూ ఓయూ విద్యార్థులంతా ధర్నాకు దిగారు. ఇది సోషల్ మీడియా ద్వారా కేసీఆర్ గారి దృష్టి కి వచ్చింది.
అదే సమస్య ను ప్రస్తావిస్తూ చేతగాని ప్రభుత్వమంటూ కేసీఆర్ ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారు.ఈ పోస్ట్ చేసిన వెంటనే చీఫ్ వార్డెన్‌కు ప్రభుత్వం షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఎస్పీడీసీఎల్ నుంచి కూడా కరెంట్ సమస్య లేదంటూ వైస్ ఛైర్మన్ పేరుతో నోటీసు ఇచ్చారు. వైస్ ఛాన్సలర్ కు బదులు వైస్ ఛైర్మన్ అని పేర్కొనటం చూస్తుంటే ఈ ప్రభుత్వం తెలివి ఎలా ఉందో అర్థమవుతోంది.

కేసీఆర్ గారు ట్వీట్ చేసిన మరుసటి రోజే రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో ఒక నోటీస్ పెట్టారు. గతేడాది కూడా అలాగే నోటీసు ఇచ్చారంటూ ఆయన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. అయితే సీఎం పెట్టిన నోటీస్ ఫేక్ అంటూ ఉస్మానియా స్టూడెంట్సే అసలైన నోటీసును సోషల్ మీడియాలో వెలుగులోకి తెచ్చారు.

అసలు జైల్లో ఉండాల్సింది ఎవరు?

ఫేక్ డాక్యుమెంట్ పెట్టిన రేవంత్ రెడ్డా? అది తప్పని చెప్పిన క్రిశాంకా?నేను చెప్పింది తప్పు అయితే చంచల్ గూడ జైలుకి వెళ్లటానికి సిద్ధం. లేదంటే రేవంత్ రెడ్డి జైలు కు వెళ్తాడా? ఈ ప్రభుత్వం తప్పులను సోషల్ మీడియాలో బయటపెడుతున్నందుకు క్రిశాంక్ మీద కక్ష గట్టి అరెస్ట్ చేశారు. నకిలీ డాక్యుమెంట్ పోస్ట్ చేసిన రేవంత్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలే. క్రిశాంక్ ను వెంటనే విడుదల చేయాలే. క్రిషాంక్ ను అరెస్ట్ చేయటం దుర్మార్గమైన చర్య. కోర్టులో దీనిపై మేము పోరాడుతాం.

సీఎం ఫేక్ డాక్యుమెంట్ చేశారని ఆయనపై ఫోర్జరీ కేసు పెట్టాలని ఓయూ విద్యార్థులు కూడా ఫిర్యాదు చేశారు. ఫేక్ సర్య్యూలర్ పోస్ట్ చేసినందకు ఈసీ రేవంత్ రెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు. 14 ఏళ్ల ఉద్యమంలో ఇలాంటి ఎన్నో వేధింపులు చూశాం. ఇలాంటి ఉడుత ఊపులకు మేము భయపడం. రాష్ట్ర వ్యాప్తంగా మా సోషల్ మీడియా వారియర్స్ పై దాడులు జరుగుతున్నాయి.

రాహుల్ గాంధీ గారు మాత్రం మెహబ్బత్ కా దుకాణ్ అంటున్నారు. కానీ మా కార్యకర్తల మీద ఈ ప్రభుత్వం దాడులకు తెగబడుతోంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకుంటుందా? లేదా? చెప్పాలె. ఇలాంటి వారికి ఓటు ద్వారానే ప్రజలు బుద్ధి చెప్పాలిని కోరుతున్నా. సత్యమేవ జయతే..సత్యమే గెలుస్తుంది. మాకు ఆ నమ్మకం ఉంది. న్యాయస్థానంలో పోరాడుతాం. కాంగ్రెస్, బీజేపీ రెండు ఒక్కటే. ఈసీ కచ్చితంగా మోడీ, రేవంత్ పై కూడా చర్యలు తీసుకోవాలె. ఫోర్జరీ చేసిన సీఎంను జైల్లో పెట్టుకుండా…అది తప్పని చెప్పిన వాళ్లను జైల్లో పెట్టటం ఏంటీ? ప్రజలు అన్ని గమినిస్తున్నారు. కచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాటం ఖాయం అని మండిప‌డ్డారు కేటీఆర్