వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు – చంద్రబాబు సంచలన కామెంట్స్

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమేనని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు షాక్ ఇచ్చారని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు శాశ్వత చికిత్స చేస్తారని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలపై సజ్జల ఒకటంటే, మంత్రి బొత్స మరొమాట అంటున్నారని విమర్శించారు. ఏప్రిల్ ఫూల్ అనే పదం జగన్‌కి సరిగ్గా సరిపోతుందని ఎద్దేవా చేశారు. ప్రజలందర్నీ ఎల్లకాలం ఫూల్స్ చేయొచ్చనే భ్రమలో జగన్ ఉన్నారని.. కానీ ప్రజలంతా కలిసి ఆయన్ని ఫూల్ చేసేందుకు సిద్ధమయ్యారన్నారన్నారు. 175 స్థానాల్లో వైసీపీను ఓడించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి ఉన్న 23 మంది సభ్యుల బలంతోనే ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకున్నామని తెలిపారు.

ఈ సందర్బంగా మాజీ సీఎం చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమతో చాలాంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వైసీపీలో కొందరు నాయకులు బానిసల్లా బతుకుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. మాజీ మంత్రి వివేక హత్యకేసు గురంచి ప్రస్తావిస్తూ.. దేశ చరిత్రలోనే సస్పెన్స్ థ్రిల్లర్ ఇదేనని… ఫిజ్ఞన్ కథలు రాసేవారు కూడా ఇలాంటివి రాయలేరని విమర్శించారు. ఇన్ని ట్విస్టులు ఉన్న కేసు దేశంలో మరొకటి లేదని ఆరోపించారు. జగన్ పేదల ప్రతినిధి కాదని పెద్ద దోపిడీదారని విమర్శించారు.