APలో హీట్ పెంచుతోన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు!

ఏపీలో ఈ నెల 23న జ‌ర‌గ‌నున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెల‌కొంది. వైసీపీ నుంచి ఏడుగురు స‌భ్యులు ప్ర‌స్తుతం బ‌రిలో దిగుతున్నారు. టీడీపీ నుంచి ఒకరు పోటీలో ఉన్నారు. మొత్తం శాసనసభ్యులన్న 175 సంఖ్యను 8తో భాగిస్తే ఒక్కో అభ్యర్థి గెలుపుకోసం 22 మొదటి ప్రాధాన్యం ఓట్లు అవసరం అవుతాయి. ఏ ఇద్దరు అభ్యర్థులైనా 22 మొదటి ప్రాధాన్యం ఓట్లు లోపే ఆగిపోతే అప్పుడు రెండో ప్రాధాన్యం ఓట్లు కీలకం కానున్నాయి. అయితే టీడీపీ అభ్యర్థికి రెండో ప్రాధాన్యం ఓట్లు పడే అవకాశం లేదు. దీంతో అధికారపార్టీకి ఈ అంశం క‌లిసొస్తుంది. కానీ… అధికార పార్టీ నుంచి క్రాస్‌ ఓటింగ్‌ జరిగితే మాత్రం తెదేపా అభ్యర్థి గెలవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

ఎవ‌రి బ‌లం ఎంతంటే..
ఏపీ అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ బలాబలాలను ప‌రిశీలిస్తే.. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరితోపాటు జ‌న‌సేన నుంచి గెలుపొందిన రాపాక వరప్రసాద్‌ , టీడీపీ నుంచి గెలుపొందిన నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరి, వాసుపల్లి గణేష్‌లు వైకాపాలో చేరారు. దీంతో వైసీపీకి 156 మంది సభ్యుల బలం ఉంది. కానీ ఇటీవ‌ల అధికార పార్టీలో నుంచి కూడా అసంతృప్తి ఎమ్మెల్యేలు ఇద్ద‌రు ఉన్నారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిలు వైసీపీకి దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. వీరి ఓట్ల‌పై మాత్రం వైసీపీ హోప్స్ పెట్టుకోలేదు. దీంతో వైసీపీకి ఇక మిగిలింది 154 స‌భ్యులే.. ఆ మొత్తం సభ్యులు కచ్చితంగా అధికార పార్టీ నిలబెట్టిన ఏడుగురు సభ్యులకు ఒక్కొక్కరూ 22 ఓట్లు వేస్తే స‌రిపోతుంది. కానీ క్రాస్‌ ఓటింగ్ జ‌రుగుతుందేమోన‌ని వైసీపీని ఆ భయం వెంటాడుతోంది.

టీడీపీ ధీమా అదే..
వైసీపీ ఇప్ప‌టికే మూడు సార్లు మాక్‌ పోలింగ్‌ నిర్వహించినా 132 మందికి మించి వైకాపా సభ్యులు హాజరుకాకపోవటం, హాజరైనా వారిలోనూ నలుగురు ఎమ్మెల్యేలు చెల్లని ఓట్లు వేయడం వంటి పరిణామాలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. దీంతో 154 మంది వైకాపా ఎమ్మెల్యేలను ఏడు బృందాలుగా విభజించి ఒక్కో బృందానికి 22 మందిని కేటాయించి ప్రతి బృందానికి ఇద్దరు, ముగ్గురు మంత్రుల పర్యవేక్షణ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అంతరాత్మ ప్రభోదానుసారం ఓటెయ్యాలంటూ తెదేపా ఇస్తున్న పిలుపునకు అనుగుణంగా పలువురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తారనే అనుమానం అధికార పార్టీకి లేకపోలేదు. రహస్య ఓటింగ్ కారణంగా టీడీపీ అభ్యర్థి గెల‌వ‌చ్చ‌ని ఆ పార్టీ చెబుతోంది. గురువారం పోలింగ్‌ నేపథ్యంలో బుధవారం రాత్రి ఎమ్మెల్యేలందరితో వైకాపా విందు భేటీ నిర్వహిస్తున్నట్టు సమాచారం.

ఫ‌లితాలు ఎప్పుడంటే..
గురువారం ఉద‌యం నుంచి పోలింగ్ ప్రారంభ‌మ‌వుతుంది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ ముగియగానే కౌంటింగ్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. సాయంత్రానికికల్లా ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది. ప్రతి ఓటూ కీలకమైనందున అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరి కదలికలను ఇంటెలిజెన్స్‌ సిబ్బందితో పర్యవేక్షిస్తున్నట్లు స‌మాచారం. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ కష్టం అనే పరిస్థితి ఉన్నవారు, పార్టీ అదనపు సమన్వయకర్తలను నియమించిన నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీపై అసంతృప్తితో ఉన్నవారు, కొంతకాలంగా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండని వారు.. ఇలా పలు కారణాలతో కొందరిపై వైకాపా అధిష్ఠానం దృష్టి సారించినట్లు చెబుతున్నారు.