Covid: 30,000 దాటిన కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌.. వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ.. తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే దేశంలోని దాదాపు 10 లక్షల మందిలో ఇద్దరికి కరోనా సోకుతున్నట్లు చెప్పారు. ఈక్రమంలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. కేరళలో ఒక్క రోజులోనే 1800 కేసులు నమోదవడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వృద్ధులు, గర్భిణులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని చెబుతున్నారు. ఇక మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో కేసులు అకస్మాత్తుగా పెరిగాయి. కరోనా వైరస్‌లో కొత్త రకం స్పైక్ న్యూజిలాండ్, ఫ్రాన్స్, దక్షిణ కొరియాల్లో విస్తరించిన మాదిరిగా ప్రమాదకరం కానప్పటికీ వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు అంటున్నారు. ప్ర‌స్తుతానికి దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు 30,000 దాటిన‌ట్లు తెలుస్తోంది.

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వ్యాప్తి నివారణకు సన్నాహాలు మళ్లీ జోరందుకున్నాయి. ఐసీయూ బెడ్లు, మందులు, ఆక్సిజన్ సిలిండర్ స్టాక్ పెంచుతున్నారు. మనదేశంలో వ్యాపిస్తోన్న కొత్త వైరస్ ఇతర దేశాలలో ఉన్నంత ప్రమాదకరం కాదని నిపుణులు కూడా చెబుతున్నప్పటికీ.. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 542 కొత్త కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో 260 కొత్త కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మరణించారు. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 535 కొత్త కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో కరోనా వ్యాప్తి రేటు 23.05 శాతానికి చేరుకుంది. కేరళలోని ఎర్నాకులం, తిరువనంతపురం, కొట్టాయం జిల్లాల్లో గరిష్టంగా కేసులు నమోదయ్యాయి.

ఏపీ, తెలంగాణలో ఇలా…
కేంద్రం సూచనల మేరకు.. తెలుగు రాష్ట్రాల్లో వైద్యశాఖ ఆధ్వర్యంలో కరోనా మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజల్ని అప్రమత్తం చేయడం, అవగాహన కల్పించడంతోపాటుగా.. కరోనా చికిత్స కోసం అందించే మందులు, బెడ్‌లు, ఆక్సిజన్‌ సదుపాయం వంటి వాటిని సమకూర్చుకునే పనిలో ఆయా రాష్ట్రాల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందిని సమాయత్తం చేస్తున్నాయి. ఇక ఏపీలోని విశాఖ లో మళ్లీ కోవిడ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 12 మంది కరోనా బాధితులు వెలుగులోకి వచ్చారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు సేకరించిన శాంపిల్స్ లో 12 కోవిడ్ కేసుల నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కూడా పదుల సంఖ్యలో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కాకినాడ జిలాల్లో కరోనాతో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండగా.. తాజాగా విశాఖ పట్నం జిల్లాలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. గత వారం రోజులలో 33 కేసులు నమోదు కాగా వీరిలో 27 మందికి ఇళ్ళల్లో 6 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికి ఏడుగురు కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఈ కొత్త వేరియంట్ తో ప్రాణాపాయ పరిస్థితులు లేనప్పటికీ అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ ధరించడం, భౌతికదూరం, శానిటైజర్‌ వంటి వాటిని వినియోగించి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.