జ‌న‌సేన ప్ర‌చార‌క‌ర్త‌గా ఆది.. నాగ‌బాబుతో క‌లిసి ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌!

జ‌న‌సేన పార్టీ సిద్దాంతాలు, ఆ పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఆలోచ‌నా విధానం న‌చ్చి ఎంతో మంది సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు జ‌న‌సేన కోసం ప‌నిచేస్తున్నారు. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన చిన్న చిన్న ఆర్టిస్టుల ద‌గ్గ‌రి నుంచి ప‌లువురు హీరోలు, డైరెక్ట‌ర్లు ప‌వ‌న్‌ను ఆరాధిస్తుంటారు. కొంద‌రు జ‌బ‌ర్ద‌స్తు ఆర్టిస్టులు గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీని గెలిపించాల‌ని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో తిరిగి ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి కూడా ప‌వ‌న్ అన్న కొణిదెల నాగ‌బాబు ప్రోత్సాహంతో వారంతా జ‌న‌సేన మ‌ద్ద‌తుదారులుగా మారారు. అయితే వీరిలో చాలా యాక్టివ్‌గా హైప‌ర్ ఆది ఉన్నారు. ఆయ‌న త‌న పంచుల‌తో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను ఉర్రూత‌లూగించ‌గ‌ల‌రు. ఇటీవ‌ల శ్రీకాకుళం జిల్లా ర‌ణ‌స్థ‌లం వేదిక‌గా జ‌రిగిన యువశ‌క్తి స‌భ‌లో కూడా హైప‌ర్ ఆది ప్ర‌సంగం రాష్ట్ర వ్యాప్తంగా హీట్ పుట్టించింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ త‌రుణంలో మ‌రోసారి త‌న వాగ్దాటి, పంచుల‌తో ఎన్నారైల‌ను ఆక‌ర్షించేందుకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబుతో క‌లిసి ఆస్ట్రేలియా బ‌య‌లుదేరి వెళ్లారు.

ఆవిర్భావ స‌భ కోస‌మే ప‌ర్య‌ట‌న‌..
జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ స‌భ ఈ నెల 14న మ‌చిలీప‌ట్నం వేదిక‌గా నిర్వ‌హించ‌నున్నారు. ఇక దీనిలో రాష్ట్రంలోని ఆ పార్టీ నాయ‌కులు, పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు. మ‌రోవైపు ఆవిర్భావ వేడుక‌ల‌ను ఆస్ట్రేలియాలో కూడా నిర్వ‌హించేందుకు అక్క‌డి ఎన్నారైలు, వీర‌మ‌హిళ‌లు, జ‌న‌సైనికులు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు జ‌బ‌ర్ద‌స్ట్ న‌టులు హైప‌ర్ ఆది, కొణిదెల నాగ‌బాబు అక్క‌డికి వెళ్తున్నారు. వీరు ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్ బోర్న్, బ్రిస్బేన్ తదితర ముఖ్య నగరాల్లో వారం రోజుల పాటు జరగనున్న ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో నాగబాబు, ఆది పాల్గొని ప్రసంగించ‌నున్నారు. కొన్ని చోట్ల ముఖ్య కార్యకర్తలతో ముఖాముఖి సమావేశాల్లో పాల్గొంటారు. ఈమేర‌కు జనసేన పార్టీ నాయకులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, హైపర్ ఆదిలు నాగబాబుతో కలిసి ఆస్ట్రేలియాలో వెళ్తున్న‌ట్లు జనసేన పార్టీ అధికారికంగా ప్ర‌కటించింది. ఇక ఇదే నాగ‌బాబు సైతం స్ప‌ష్టం చేశారు.

రానున్న ఎన్నిక‌ల్లో ఆది పోటీ చేస్తారా..
జనసేన పార్టీ కార్యక్రమాల్లో హైపర్ ఆది కూడా ఇటీవలి కాలంలో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ఈ ఏడాది జనవరిలో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్విహించిన యువశక్తి సభలో హైపర్ ఆది పవర్ ఫుల్ స్పీచ్‌తో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో జనసేన తరఫున హైపర్ ఆది పోటీ చేయనున్నారనే ప్రచారం కూడా న‌డుస్తోంది.