పరీక్షకు వెళ్తూ విద్యార్థినికి రోడ్డు ప్రమాదం.. అయినా నో ఎంట్రీ!

శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం సోమరాజుపేటకు చెందిన విద్యార్థిని హర్షిత ఇంటర్‌ మొదటి సంవత్సరం చివర పరీక్ష రాసేందుకు మంగళవారం ఆటోలో రాజాం గాయత్రి కాలేజికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హర్షితకు గాయాలయ్యాయి. ఈక్రమంలో వైద్యం కోసం విద్యార్థినిని రాజాం స్తానిక ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం ముందుగా కాలేజీ అధికారులకు తెలియజేశారు. వైద్యం అనంతరం పరీక్షా కేంద్రానికి పది నిమిషాలు ఆలస్యంగా విద్యార్థిని చేరుకుంది. పరీక్ష కేంద్రం వద్ద పోలీసులకు, అధికారులకు గాయాలతోపాటు డాక్టర్‌ ఇచ్చిన ఓపి, మందులు రసీదు చూపించినప్పటికీ పరీక్ష రాసేందుకు వారు అనుమతించలేదు. విద్యార్థి ఎంతసేపు బతిమలాడినా, చివరకు పరీక్షకు అనుమతించక పోవడంతో బోరున ఏడ్చింది. తన భవిష్యత్తు ఏమైపోతుందోనని భయపడి పరీక్ష కేంద్రం గేటు వద్దనే కుప్పకూలింది. ప్రమాదం జరిగినట్లు ముందుగా సమాచారం ఇచ్చినా, అనుమతించక పోవడం అన్యాయమని విద్యార్థిని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.