Game Changer: హైప్ పెంచేస్తున్న‌ స్టార్ రైటర్!

Hyderabad: మెగా పవర్ స్టార్ రామ్​ చరణ్(Ram Charan), కోలీవుడ్​ స్టార్​ డైరెక్టర్​ శంకర్(Shankar) కాంబినేషన్లో ‘గేమ్ ఛేంజర్'(Game Changer) సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్​పై మొదటినుంచీ భారీ అంచనాలే ఉన్నాయి. RC15 వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కిన ఈ సినిమా ఈ మధ్యనే టైటిల్​ ఖరారు చేసుకుంది.

ఈ సినిమాలో రామ్​ చరణ్ డబుల్ రోల్​ చేయనున్నారనే వార్తలు కూడా సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్‌‌ సినిమాకు రైటర్‌‌గా పని చేస్తున్న స్టార్ రైటర్‌‌ సాయి మాధవ్ బుర్రా( Sai Madhav Burra) ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ‘’గేమ్ ఛేంజర్’ నెక్ట్స్ లెవెల్ మూవీ. ప్రేక్షకులు సినిమా ఎలా ఉండాలని కోరుకుంటున్నారో? అంతకు మించి ఉంటుంది. అంచనాలు ఎన్నైనా.. ఎలాగైనా పెట్టుకోండి. అంతకంటే గొప్పగా ఉంటుంది సినిమా.

సినిమా రిలీజ్ అయ్యి చూసిన వారంతా ఇదే చెబుతారు. శంకర్ గారు చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. ఎంతో డౌన్ టూ ఎర్త్ గా ఉండే వ్యక్తి. శంకర్‌‌ గారు తెరకెక్కించిన ‘జెంటిల్​మెన్’ సినిమా చూసి.. ఈ దర్శకుడితో లైఫ్‌లో ఒక్క ఫోటో దిగితే చాలని అనుకున్నాను. అలాంటిది ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. గేమ్ ఛేంజర్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. సినిమా చాలా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ప్రతీ షాట్ ఒక అద్భుతం అనేలా తీస్తున్నారు.

సినిమాకు ఏదో చేయాలని ఖర్చు చేసినట్టు ఎక్కడా అనిపించదు. ఆ షాట్ కి ఎంత ఖర్చు చేసినా ఫర్వాలేదు అనిపించేలా ఉంటుంది. సినిమా కథ అలాంటిది. చాలా బలమైన కాన్సెప్ట్’ అని అన్నారు సాయి మాధవ్. ఆయన చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. దిల్‌ రాజు(Dil Raju) నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది.