Chiranjeevi: నా త‌మ్ముడు అన్ని మాట‌లు ప‌డుతుంటే త‌ట్టుకోలేక‌పోతున్నా

chiranjeevi requests pithapuram people to vote for pawan kalyan

Chiranjeevi:  ప్ర‌జ‌ల కోసం ఏద‌న్నా చేయాల‌ని ప‌రిత‌పిస్తున్న త‌న త‌మ్ముడు, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను గెలిపించాల‌ని పిఠాపురం వాసుల‌ను కోరారు మెగాస్టార్ చిరంజీవి. త‌న త‌మ్ముడికి ఓటు వేసి గెలిపించండి అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసారు.

“” కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అమ్మ క‌డుపున ఆఖ‌రివావిగా పుట్టినా అంద‌రికీ మంచి చేయాలి మేలు చేయాలి అనే విష‌యంలో ఎప్పుడూ ముందు వాడిగా ఉంటాడు. త‌న గురించి కంటే జ‌నం గురించి ఎక్కువ‌గా ఆలోచించే మ‌న‌స్త‌త్వం నా త‌మ్ముడు క‌ళ్యాణ్ బాబుది. ఎవ‌రైనా అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌జ‌లు ఏద‌న్నా చేయాలి అనుకుంటారు. కానీ క‌ళ్యాణ్‌ అధికారంలోకి రాక‌పోయినా త‌న సొంత సంపాద‌న‌ను కౌలు రైతుల క‌న్నీళ్లు తుడిచేందుకు ఖ‌ర్చు పెట్టాడు. ఇలాంటి ఎన్నో సాయాలు చేసిన క‌ళ్యాణ్ బాబుని చూస్తుంటే ఇలాంటి నాయ‌కుడు క‌దా జ‌నాల‌కు కావాల్సింది అనిపించింది.

ఒక ర‌కంగా చెప్పాలంటే క‌ళ్యాణ్ సినిమాల్లోకి బ‌లవంతంగా వ‌చ్చాడు. కానీ రాజ‌కీయాల్లోకి ఇష్టంగానే వ‌చ్చాడు. ఏ త‌ల్లికైనా త‌న కొడుకు క‌ష్ట‌ప‌డుతుంటే గుండె త‌రుక్కుపోతుంది. ఏ అన్న‌కైనా త‌న త‌మ్ముడు అన‌వ‌స‌రంగా మాట‌లు ప‌డుతుంటే బాధేస్తుంది. అలా బాధ‌ప‌డుతున్న నా త‌ల్లికి ఒక్క‌టే చెప్పాను. నీ కొడుకు ఎంతో మంది త‌ల్లులు వారి బిడ్డ‌ల భ‌విష్య‌త్తు కోసం చేసే యుద్ధం అని. మ‌న బాధ‌కంటే అది ఎంతో గొప్ప‌ద‌ని చెప్పాను. అన్యాయాన్ని ఎదిరించ‌కుండా మౌనంగా ఉండే మంచి వాళ్ల వ‌ల్లే ప్ర‌జాస్వామ్యానికి మ‌రింత న‌ష్టం అని న‌మ్మి జ‌నం కోసం జ‌న‌సైనికుడు అయ్యాడు. తాను బ‌లంగా న‌మ్మే సిద్ధాంతం కోసం త‌న జీవితాన్ని రాజ‌కీయాల‌కు అంకితం చేసిన శ‌క్తిశాలి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

ప్ర‌జ‌ల కోసం ఆ శ‌క్తిని వినియోగించాలంటే చ‌ట్ట స‌భ‌ల్లో అత‌ని గొంతు వినిపించాలి. జ‌న‌మే జ‌యం అని న‌మ్మే జ‌న‌సేనాని ఏం చేయ‌గ‌ల‌డో చూడాలంటే మీరు పిఠాపురంలో అత‌నికి ఓటు వేసి గెలిపించాలి. మీకు సేవ‌కుడిగా సైన‌కుడిగా నిల‌బ‌డ‌తారు. పిఠాపురం వాస్త‌వ్యుల‌కు ఈ చిరంజీవి విన్న‌పం. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి ప‌వ‌న్‌ను గెలిపించండి. జై హింద్ “” అని పేర్కొన్నారు.