గేటు తీయ‌డంలో ఆల‌స్యం.. టోల్ ప్లాజా ఉద్యోగి దారుణ హ‌త్య‌

Bengaluru: టోల్ ప్లాజా (toll plaza) గేటు తీయడంలో కాస్త ఆల‌స్యం అవ‌డంతో ఆ ఉద్యోగిని దారుణంగా చంపేసారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లో (karnataka) చోటుచేసుకుంది. బెంగ‌ళూరు నుంచి 35 కిలోమీట‌ర్లు దూరంలో ఉన్న రామ‌న‌గ‌ర టోల్ ప్లాజా వ‌ద్ద ఈ ఘ‌ట‌న నిన్న రాత్రి చోటుచేసుకుంది. నిన్న డ్యూటీలో ప‌వ‌న్ కుమార్, మంజునాథ్ ఉన్నారు. రాత్రి 10 గంట‌ల ప్రాంతంలో న‌లుగురు యువ‌కులు కారులో మైసూరు వెళ్తున్నారు. రామ‌న‌గ‌ర టోల్ ప్లాజా వ‌ద్ద‌కు రాగానే ఫాస్టాగ్ ఉన్న‌ప్ప‌టికీ గేటు తెరవ‌డంలో ఆల‌స్య‌మైంది. దాంతో ఆ యువ‌కులు ప‌వ‌న్ కుమార్, మంజునాథ్‌ల‌తో గొడ‌వ‌ప‌డ్డారు.

మాటా మాటా పెర‌గ‌డంతో ఆ యువ‌కులు క‌లిసి మంజునాథ్, ప‌వ‌న్‌ల‌పై చేయి చేసుకున్నారు. స్థానికులు గ‌మ‌నించి న‌చ్చ‌జెప్పి పంపించేసారు. అయినా కారులో ప్ర‌యాణిస్తున్న యువ‌కులు ఊరుకోలేదు. కొన్ని మీటర్ల దూరంలో కారు పార్క్ చేసుకుని ప‌వ‌న్, మంజునాథ్‌ల అంతు చూడాల‌నుకున్నారు. 12 దాటాక ప‌వ‌న్, మంజునాథ్ డిన్న‌ర్ చేయ‌డానికి బూత్ నుంచి బ‌య‌టికి వ‌చ్చారు. అక్క‌డే కాపు కాస్తున్న ఆ న‌లుగురు యువ‌కులు హాకీ క‌ర్ర‌ల‌తో వారిని చిత‌క‌బాదారు. ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా బ్లీడ్ అవ్వ‌డంతో ప‌వ‌న్ కుమార్ అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయాడు. మంజునాథ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.