గుండెపోటు మరణాలపై ప్రభుత్వ కీలక నిర్ణయం!

ఈ మధ్యకాలంలో ఆకస్మిక గుండెపోటు మరణాలు చాలా పెరుగుతున్నాయి. 20 నుంచి 40 ఏళ్ల వయస్సుగల వారు ఎక్కువగా గుండెపోటు బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అందుబాటులో ప్రాథమిక చికిత్సలేకపోవడం వల్ల ఆసుపత్రికి వెళ్లేలోపే చాలామంది కన్నుమూస్తున్నారు. ఈ తరహా ఘటనలు రోజురోజుకూ పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కార్డియోపల్మనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌)లో లక్షమందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించింది. అలాగే, అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినవారికి అపర సంజీవనిలా పనిచేసే ఆటోమెటిక్‌ ఎక్స్‌టర్నల్‌ డీఫిబ్రిలేటర్‌ (ఏఈడీ) పరికరాలను తెప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. పబ్లిక్‌ ప్లేస్‌లలో ఏర్పాటుచేసేందుకు 1400 పరికరాలకు ఇప్పటికే ఆర్డర్‌ ఇచ్చినట్టు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.
ప్రథమ చికిత్స..
ప్రాణాంతకంగా పరిణమించిన గుండెపోటు బాధితులకు ఆటోమెటిక్‌ ఎక్స్‌టర్నల్‌ డీఫిబ్రిలేటర్‌ (ఏఈడీ) అపర సంజీవనిగా నిలుస్తుంది. ఈ పరికరం దవాఖానకు వెళ్లేలోపు అత్యవసర చికిత్సను అందించి ఆయువును పెంచుతుంది. ప్రపంచస్థాయి నగరాల్లో ఇప్పటికే పబ్లిక్‌ యాక్సెస్‌ డీఫీబ్రిలేటర్లు గుండెపోటు బాధితులకు ఊపిరిపోస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ ముఖర్జీ ఇతర దేశాల్లో మాదిరిగా హైదరాబాద్‌లోనూ పబ్లిక్‌ యాక్సెస్‌ డీఫిబ్రిలేటర్లను ఏర్పాటుచేయాలని ట్విట్టర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఈ ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్‌.. మొదటి విడతలో 1400 డీఫిబ్రిలేటర్లకు ఆర్డర్‌ ఇచ్చినట్టు ప్రకటించారు. వీటిని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, మాల్స్‌, ప్రభుత్వ కార్యాలయాలవంటి బహిరంగ ప్రదేశాల్లో అందుబాటులోకి తేనున్నారు. ఈ డీఫిబ్రిలేటర్‌ను ఎవరైనా ఉపయోగించవచ్చు. శిక్షణ అవసరం కూడా లేదని వైద్య నిపుణులు చెప్తున్నారు.
ఎలా ఉపయోగించాలంటే..
*ఎవరైనా గుండెపోటుకు గురైనట్టు గుర్తిస్తే వెంటనే 999 ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్‌ చేయాలి. సంబంధిత ఆపరేటర్‌ డీఫిబ్రిలేటర్‌ పరికరం ఉన్న సమీప ప్రాంతం వివరాలను తెలియజేస్తారు. గ్రీన్‌ బటన్‌ నొక్కి డీఫిబ్రిలేటర్‌ను ఆన్‌ చేశాక.. ఆ పరికరం వాయిస్‌ రూపంలో ఇచ్చే సూచనలను అనుసరించాలి.
*డీఫిబ్రిలేటర్‌ పరికరంపై ఉన్న చిత్రంలో చూపినవిధంగా స్టిక్కీ ప్యాడ్‌లను రోగి ఛాతిపై అమర్చాలి. ప్యాడ్‌లను అమర్చిన తర్వాత అప్పటివరకు చేసిన కార్డియోపల్మనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌)ను ఆపివేయాలి.
*పరికరం రోగి గుండె లయను పరీక్షించి షాక్‌ అవసరమా? లేదా! అన్నది నిర్ణయిస్తుంది. షాక్‌ అవసరమైతే..షాక్‌ బటన్‌ నొక్కాలని చెప్తుంది. షాక్‌ ప్రక్రియ పూర్తయ్యాక సీపీఆర్‌ కొనసాగించాలా? వద్దా? అన్నది కూడా డీఫిబ్రిలేటర్‌ తెలియజేస్తుంది. గుండె లయకు సంబంధించిన సంకేతాలను చూపించే వరకు.. ఆపరేటింగ్‌ను ఆపివేయాలని డీఫిబ్రిలేటర్‌ చెప్పేవరకూ ఈ ప్రక్రియను కొనసాగించాలి. ఈ అత్యవసర చికిత్సతో ప్రాణాపాయం నుంచి రోగిని రక్షించే అవకాశం ఉంటుంది.