AP Elections: ఇక‌ మా కొడుకుల‌కు సీట్లు ఇవ్వండి ప్లీజ్!

AP: ఏపీలోని అధికార YCP నుంచి వచ్చే దఫా ఎన్నికల్లో (ap elections) ఎమ్మెల్యేల తనయులు రాజకీయ రంగప్రవేశం చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇక తాజాగా మచిలీపట్నం పోర్టు పనులను సీఎం జగన్‌ (cm jagan) ప్రారంభించారు. ఈ సందర్బంగా మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని (perni nani) సభలో మాట్లాడుతూ… సీఎం జగన్‌తో కలిసి పంచుకునే వేదిక ఇదే చివరిదని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయనని, రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి అలియాస్‌.. కిట్టూ… గత కొంత కాలంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రజల మధ్యకు వెళ్తూ.. వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యే నాని మచిలీపట్నం నుంచి పోటీ చేయని పక్షంలో ఆయన కుమారుడు కిట్టూకి అవకాశం ఇవ్వవచ్చు.

ఇక తిరుపతి సీనియర్‌ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమున కరుణాకర్‌ రెడ్డి రానున్న ఎన్నికల్లో వారి కొడుకులను రంగంలోకి దింపనున్నారు. చెవిరెడ్డి కుమారుడు మోహిత్‌ రెడ్డి చంద్రగిరి ఎంపీపీగా గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో మోహిత్‌రెడ్డికి టికెట్‌ కన్ఫామ్‌ చేశారని సమాచారం. మరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది తెలియాల్సి ఉంది. తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌ రెడ్డి కుమారుడు.. అభినయ్‌ రెడ్డి.. డిప్యూటీ మేయర్‌గా తిరుపతి కార్పొరేషన్‌లో పనిచేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో బరిలో దిగేందుకు అభినయ్‌ ప్రయత్నాలు సాగిస్తుండగా.. అధిష్టానం నుంచి ఎలాంటి గ్యారెంటీ ఇవ్వలేదు. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు.. వారి కుమారులను పోటీలో ఉంచాలని చూస్తున్నారు. అయితే ఇందులో ఇద్దరికి మాత్రం సీట్లు ఇచ్చే అవకాశం ఉందని వైసీపీ వర్గాల సమాచారం. ఒకవేళ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు బదులుగా వారి కుమారులకు ఇస్తే ప్రజలు ఏమాత్రం విశ్వసిస్తారు అన్నది చూడాల్సి ఉంది. అయితే.. సీఎం జ‌గ‌న్‌ని చూసి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తారాని, దీంతో ఏ నియోజకవర్గంలో ఎవరు నిల్చుంటే ఏంటని వార్తలు వస్తున్నాయి.