Part Time Jobs: ధ‌ర‌ల‌కు భ‌య‌ప‌డి 40% మంది రెండేసి ఉద్యోగాలు..!

Hyderabad: ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఒక్క జాబ్(jobs) దొర‌క‌డ‌మే క‌ష్టంగా ఉంది. రోజురోజుకీ పెరిగిపోతున్న ధ‌ర‌ల కార‌ణంగా మిలీనియ‌ల్స్, జెన్ Z వారంతా ఫుల్ టైం ఉద్యోగాల‌తో పాటు పార్ట్ టైం జాబ్స్(part time jobs) కూడా చేస్తున్నార‌ట‌. మిలీనియ‌ల్స్ అంటే.. 1980-1990ల మ‌ధ్య‌లో పుట్టిన‌వారు. జెన్ Z అంటే 1990-2010 మ‌ధ్య‌లో పుట్టిన‌వారు. ప్ర‌ముఖ ఐటీ కంపెనీ డెలాయిట్(deloitte) నిర్విహించిన స‌ర్వేలో ఈ విష‌యం బ‌య‌టికి వ‌చ్చింది.

దేశంలోని మిలినీయ‌ల్స్, జెన్ Z కేట‌గిరీకి చెందిన వారిలో దాదాపు 40% మంది రెండు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇందుకు కార‌ణం నిరుద్యోగాలు, పెరుగుతున్న ధ‌ర‌లు. ఈ మ‌ధ్య‌కాలంలో రిసెష‌న్ కార‌ణంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. దాంతో న‌చ్చిన జాబ్ దొర‌క్క ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ అయిపోతూ పార్ట్ టైం, లేదా ఫుల్ టైంలో రెండో ఉద్యోగాన్ని కూడా చేసుకుంటున్నారు. డ‌బ్బు కూడ‌బెట్టుకోవ‌డం కోసం సెకండ్ హ్యాండ్ దుస్తులు, వాహ‌నాలు కొనుక్కుంటున్న‌ట్లు స‌ర్వేలో తేలింది. 44 దేశాల‌కు చెందిన వారితో డెలాయిట్ ఈ స‌ర్వే చేప‌ట్టింది. అందులో 800 మంది ఇండియాకు చెందిన‌వారే. పెరుగుతున్న ధ‌ర‌ల‌ను ఒక్క జాబ్ చేస్తూ త‌ట్టుకోలేమ‌ని, అందుకే రెండు, మూడు చేస్తున్న‌వారు చాలా మంది ఉన్నార‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేసారు. వ‌ర్క్‌లైఫ్ బ్యాలెన్స్ బాలేక‌పోయినా, అనారోగ్య స‌మ‌స్య‌లు, ఒత్తిడి ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ కుటుంబాల‌ను పోషించుకోవ‌డం కోసం త‌ప్ప‌ట్లేద‌ని తెలిపారు.