భ‌ర్త కోసం ఉప‌వాసం ఆపై హ‌త్య

wife kills husband after fasting for him

Viral News: భ‌ర్త నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాల‌ని ఉప‌వాసం చేసింది. ఆ త‌ర్వాత భ‌ర్త‌ను చంపేసి ఇంట్లోవారికి షాకిచ్చింది ఓ భార్య‌. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. కౌశాంబి జిల్లాకు చెందిన స‌విత క‌ర్వా చౌత్ (ఉత్త‌రాది పండుగ‌) సంద‌ర్భంగా నిన్నంతా త‌న భ‌ర్త శైలేష్ కోసం ఉప‌వాసం చేసింది. ఉప‌వాసం ముగిసాక త‌న భ‌ర్త‌కు భోజ‌నం పెట్టి తానూ తినాల‌నుకుంది. ప్లాన్ ప్ర‌కారం శైలేష్‌కు భోజనం పెట్టింది కానీ త‌ను మాత్రం తిన‌లేదు. భోజనం చేసిన కొద్దిసేప‌టికే శైలేష్ కుప్ప‌కూలిపోయాడు.

వెంట‌నే శైలేష్ సోద‌రుడు అఖిలేష్ స్థానిక హాస్పిట‌ల్‌కు త‌ర‌లించ‌గా విష ప్ర‌యోగం జ‌ర‌గ‌డం వ‌ల్ల అత‌ను చ‌నిపోయిన‌ట్లు వైద్యులు తెలిపారు. త‌న వ‌దిన స‌విత‌పై అనుమానం ఉన్న అఖిలేష్ వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేసాడు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించ‌గా.. త‌న భ‌ర్త‌కు వేరే అమ్మాయితో ఎఫైర్ ఉన్న‌ట్లు త‌నకు అనుమానంగా ఉంద‌ని.. అందుకే విషం పెట్టి చంపేసాన‌ని వెల్ల‌డించింది. భ‌ర్తపై అంత కోపం ఉన్న‌దానివి ఉప‌వాసం ఎందుకు చేసావ్ అని అడ‌గ్గా దానికి మాత్రం ఆమె నోరుమెద‌ప‌లేదు.