Viral News: పెళ్లైన మూడు నెలలకే.. భర్త మృతితో భార్య ఆత్మహత్య..!

Viral News: ఘజియాబాద్‌లో ఓ హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. జూ చూడడానికి వచ్చిన ఓ యువ జంట కొద్ది గంటల్లోనే విగతజీవులుగా మారడం తెలిసినవారందరినీ విషాదంలో ముంచేసింది. ఈ భార్యాభర్తలిద్దరూ 24 గంటల లోపే చనిపోయారు. 25 ఏళ్ల అభిషేక్ అహ్లువాలి గుండెపోటుతో మరణించగా, అతని భార్య అంజలి ఆ షాక్ తట్టుకోలేక ఏడో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.

కొన్ని బంధాలు మరణంలో కూడా తోడుగా ఉంటాయి. ప్రేమించే వ్యక్తి దూరమైతే ఆ బాధ ఎంతలా వేధిస్తుందో తెలియనిది కాదు. అలాంటి ఓ జంట విషాదంగా తమ జీవితాన్ని ముగించిన ఘటనే ఈ వార్త. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌కి చెందిన అభిషేక్(25), అంజలి(23)కి నెల రోజుల క్రితం వివాహం అయింది. సోమవారం, ఇద్దరూ ఢిల్లీ జంతు ప్రదర్శనశాలకు వెళ్లాలనుకున్నారు. అనుకున్నట్టుగానే ఉదయాన్నే జూకు చేరుకున్నారు. అక్కడ సరదాగా జంతువులని చూస్తున్న సమయంలో అభిషేక్‌కు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో కంగారు పడ్డ అంజలి తన స్నేహితులకు ఫోన్ చేసి పిలిపించింది. అభిషేక్ ను మొదట గురు తేగ్ బహదూర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వారు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి రెఫర్ చేశారని బంధువులు తెలిపారు. (Viral News)

ALSO READ: Paytm: ఉద్యోగం పోతుంద‌నే భయంతో ఉద్యోగి ఆత్మహత్య

అదేరోజు అభిషేక్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. గుండెపోటు వల్లే అతను చనిపోయాడని తేల్చారు. ఆ తరువాత అభిషేక్ మృతదేహాన్ని రాత్రి 9 గంటల సమయంలో ఘజియాబాద్‌లోని వైశాలిలోని అహ్ల్కాన్ అపార్ట్‌మెంట్‌లోని వారుంటున్న ఇంటికి తీసుకొచ్చారు. భర్త మరణించాడన్న షాక్‌ తట్టుకోలేక అంజలి తాముంటున్న ఏడో అంతస్తులోని బాల్కనీలో నుంచి కిందికి దూకింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను వైశాలిలోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచింది.

అభిషేక్ బంధువు బబిత మాట్లాడుతూ.. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అంజలి అభిషేక్ పక్కనే కూర్చొని చాలా సేపు ఏడ్చింది. ఆ తరువాత వెంటనే లేచి బాల్కనీ వైపు పరుగెత్తింది. ఆమె దూకుతుందేమో అని అనుమానం వచ్చింది. వెంటనే ఆమె వెనకే పరుగెత్తాను. ఆపండి అని అరుస్తూనే ఉన్నాను.. అంతలోనే ఆమె దూకేసింది” అన్నారు. అభిషేక్‌ను మొదట జంతుప్రదర్శనశాలకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గురు తేగ్ బహదూర్ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు మరో బంధువు సంజీవ్ తెలిపారు. “అభిషేక్ ను సఫ్దర్‌జంగ్‌కు తీసుకెళ్లమని వారు చెప్పారు. నేను కూడా అక్కడికి చేరుకున్నాను. డాక్టర్‌తో మాట్లాడాను. వారు తమ శాయశక్తులా ప్రయత్నించారు, కానీ అతన్ని రక్షించలేకపోయారని’’ అతను చెప్పాడు. భార్యభర్తలిద్దరూ 24 గంటల్లో మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

25 ఏళ్ల యువకుడి మరణం విషాదాన్ని మిగిల్చింది. చిన్నవయసులో గుండెపోటుకు బలవుతున్న యువకుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. గర్బా ఈవెంట్‌లు, పెళ్లి ఊరేగింపులు, జిమ్‌లలో యువకులు కుప్పకూలిపోయి గుండెపోటుతో మరణిస్తున్న అనేక సంఘటనలు గత రెండు సంవత్సరాలుగా వెలుగు చూస్తున్నాయి. కరోనా తరువాత చాలా మంది గుండెలు బలహీనంగా మారాయని డాక్టర్లు అంటున్నారు. వ్యాయామం చేస్తూ కుప్పకూలిన ఉదంతాలు అనుభవంలో ఉన్నవే. గుండెపోటు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటూ, సమయానికి నిద్ర పోతూ, శరీరానికి అవసరమైన మేర వ్యాయామం చేస్తే గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు.