Covid 19: కేర‌ళ‌లో 300 కొత్త కేసులు.. 3 మృతి.. కేర‌ళ‌లోనే ఎందుకిలా?

Covid 19: మీరు గ‌మ‌నించిన‌ట్లైతే కోవిడ్‌కి సంబంధించి ఏద‌న్నా కొత్త ఉప‌ర‌కం వైర‌స్ వ‌చ్చినా.. లేదా కోవిడ్ కాకుండా మ‌రేద‌న్నా వైర‌స్ వ‌చ్చినా తొలి కేసు 99% కేర‌ళ‌లోనే (kerala) న‌మోద‌వుతుంది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కువ అవుతున్న JN.1 వైర‌స్ కూడా మొద‌ట కేర‌ళ‌కు చెందిన ఓ మ‌హిళ‌కు వ‌చ్చింది. ఆ త‌ర్వాత నుంచి వ‌రుస‌గా అక్క‌డ కేసులు పెరుగుతూ ఇత‌ర రాష్ట్రాల‌కు వ్యాప్తిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కేర‌ళ‌లో కొత్త‌గా 300 కేసులు రాగా.. ముగ్గురు మృతిచెందారు. ప్ర‌స్తుతానికైతే కేర‌ళ‌లో యాక్టివ్ కేసులు 2,341. కోవిడ్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కేర‌ళ‌లో ఇప్ప‌టివ‌ర‌కు 72,059 మంది మృతిచెందారు.

కేర‌ళ‌లోనే ఎందుకు?

ఎందుకంటే కేర‌ళ ఆరోగ్య శాఖ దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌తో పోలిస్తే ఎంతో అలెర్ట్‌గా ఉంటుంది. ఎంత అలెర్ట్ అంటే ఇంకో కొత్త వైర‌స్ రావ‌చ్చేమో.. లేదా ఉప‌ర‌కం రావ‌చ్చేమో అని చిన్న వార్త బ‌య‌టికి వ‌చ్చినా ముందు కేర‌ళ క‌ఠినంగా చ‌ర్య‌లు తీసుకుని ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తుంది. ఇండియాలోకి ఏ కేసు రాక‌పోయినా కూడా కేర‌ళ వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తుంది. అందుకే కేర‌ళ‌ నుంచి తొలి కేసు బ‌య‌ట‌ప‌డుతుంద‌ని వైద్యుడు అనీష్ తెలిపారు.