Mumbai: త్వ‌ర‌లో పెళ్లి.. NRI జంట స‌జీవ‌ద‌హ‌నం

ఇంకొన్ని రోజుల్లో పెళ్లి అనగా.. గుజ‌రాత్ (gujarat) నుంచి ముంబైలోని (mumbai) ఓ హోట‌ల్‌కి వ‌చ్చారు ఆ జంట‌. పెళ్లి ప‌నుల‌న్నీ చ‌క‌చ‌కా జ‌రిగిపోతున్న స‌మ‌యంలో హోట‌ల్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్ర‌మాదం వారిని బలితీసుకుంది. ఈ ఘ‌ట‌న ముంబైలోని సాంటాక్ర‌జ్ గెలాక్సీ హోట‌ల్‌లో చోటుచేసుకుంది. గుజ‌రాత్‌లోని క‌చ్ జిల్లాకు చెందిన కిష‌న్, రూప‌ల్ వ‌కేరియా అనే ఇద్ద‌రు ఎన్నారైలు ప్రేమించుకున్నారు. నైరోబిలో డెస్టినేష‌న్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నారు.

ఇందుకోసం బంధువుల‌తో క‌లిసి గుజ‌రాత్ నుంచి ముంబైలో (mumbai) ల్యాండ్ అయ్యారు. ముంబై నుంచి నైరోబి ఫ్లైట్ ఎక్కాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో సాంటాక్ర‌జ్ హోట‌ల్‌లో మూడు రూంలు బుక్ చేసుకున్నారు. కానీ విధికి క‌న్ను కుట్టిందేమో. ఆదివారం ఉన్నట్టుండి హోట‌ల్‌లో మంట‌లు చెలరేగాయి. మంట‌లు చెల‌రేగిన రూంకి ఎన్నారై జంట ఉన్న రూం ప‌క్క‌నే ఉండ‌టంతో ఊపిరాడ‌క కాబోయే వ‌ధూవ‌రులు ఇద్దరూ అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. కిష‌న్ త‌ల్లిదండ్రుల‌కు, చెల్లెల్లికి స్వల్పంగా గాయాల‌య్యాయి. వాళ్లు నైరోబీలోనే ఉండి ఉంటే ఈ ఘోరం జ‌ర‌గ‌కుండా ఉండేద‌ని ఆ జంట త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు.