2 భార్య‌లు..9 మంది పిల్ల‌లు.. 6 గ‌ర్ల్‌ఫ్రెండ్స్..పోషించేందుకు మోసాలు!

Lucknow: ఇద్ద‌రు భార్య‌లు.. వారికి పుట్టిన 9 మంది పిల్ల‌లు.. ఇది చాల‌ద‌న్న‌ట్లు ఆరుగురు గ‌ర్ల్‌ఫ్రెండ్స్.. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ వ్య‌క్తి ఘ‌న‌కార్యం ఇది. ల‌ఖ్‌నౌకి చెందిన అజీత్ మౌర్యా అనే వ్య‌క్తి ఆరో త‌ర‌గ‌తితోనే చ‌దువు ఆపేసాడు. ఆ త‌ర్వాత చిన్నా చిత‌కా ప‌నులు చేసుకుంటూ ముంబైలో ప్లాస్ట‌రింగ్ ప‌నులు చేస్తూ క‌డుపు నింపుకుంటున్నాడు. ఇత‌ను 2000లో సంగీత అనే యువ‌తిని పెళ్లిచేసుకున్నాడు.

ఆమెతో క‌లిసి ఏకంగా ఏడుగురు పిల్ల‌ల్ని క‌న్నాడు. 2010లో ఉద్యోగం పోవ‌డంతో తిరిగి త‌న స్వ‌స్థలానికి వెళ్లిపోయాడు. ఎంత ప్ర‌య‌త్నించినా స‌రైన ఉద్యోగం దొర‌క‌క‌పోవ‌డంతో దొంగ‌త‌నాలు చేయ‌డం మొద‌లుపెట్టాడు. దాంతో 2016లో ఇత‌నిపై తొలి పోలీస్ కేసు న‌మోదైంది. అయినా కూడా అజిత్‌కు సిగ్గు రాలేదు. త‌న‌కు పెళ్లి కాలేద‌ని చెప్పి 30 ఏళ్ల సుశీల అనే యువ‌తిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో మ‌రో ఇద్ద‌రు పిల్ల‌ల్ని క‌న్నాడు. వారిని పోషించేందుకు న‌కిలీ క‌రెన్సీలు స‌ర‌ఫ‌రా చేయ‌డం వంటి స్కాంల‌కు పాల్ప‌డేవాడు.

ఇత‌నితో పాటు సుశీల కూడా దొంగ నోట్ల వ్యాపారం మొద‌లుపెట్ట‌డంతో బాగానే డ‌బ్బులు సంపాదించుకున్నారు. ఆ త‌ర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచి ఇన్‌ఫ్లుయెన్స‌ర్‌గా మారాడు. త‌న మాట‌తీరుతో మ‌రో ఆరుగురు అమ్మాయిల‌ను లైన్‌లో పెట్టాడు. వారితో క‌లిసి ప‌లు ట్రిప్‌ల‌కు వెళ్లేవాడు. ఇలా అంద‌రినీ సంతృప్తిప‌రిచేందుకు మ‌రిన్ని మోసాల‌కు పాల్ప‌డ‌టం మొద‌లుపెట్టాడు.

న్యూ ఇయ‌ర్ రాబోతున్న సంద‌ర్భంగా త‌న మొద‌టి భార్య‌ను విదేశీయ ట్రిప్‌కు తీసుకెళ్లాల‌ని అనుకున్నాడు. ఈ నేప‌థ్యంలో అత‌ను ఓ ల‌గ్జ‌రీ హోట‌ల్‌కు త‌న భార్య‌ను తీసుకెళ్లాడు. అప్ప‌టికే అజిత్‌పై తొమ్మిది కేసులు ఉండ‌టంతో పోలీసుల‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారాడు. దాంతో పోలీసులు చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి అత‌ను ఉన్న హోట‌ల్‌కు వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు.