Marriage: ఆగిపోయిన పెళ్లి.. లేచిపోయిన వ‌ధూవ‌రులు

ఈ మ‌ధ్య‌కాలంలో చిన్న చిన్న వివాదాల‌కే పెళ్లిళ్లు (Marriage) పీట‌ల‌మీదే ఆగిపోతున్నాయి. ఒక‌ప్పుడు పీట‌ల‌పై పెళ్లి ఆగిపోవ‌డం అంటే చిన్న విష‌యం కాదు. పెళ్లి ఆగిపోతే ప‌రువుపోతుంది ముందు ఆ తాళేదో క‌ట్టేస్తే త‌ర్వాత సంగ‌తి త‌ర్వాత అన్న‌ట్లు పెళ్లిళ్లు హ‌డావిడిగా కానిచ్చేసేవారు. అస‌లు ఆ పెళ్లి వ‌ధూవ‌రుల‌కు ఇష్ట‌మో కాదో కూడా తెలుసుకునేవారు కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. వ‌ధూవ‌రుల‌కు పెళ్లి ఇష్ట‌ముంటేనే పెళ్లి చేయాలి. లేదంటే వారు పెళ్లి రోజో లేదా తాళి క‌ట్టిన మ‌రుస‌టి రోజో లేచిపోతుంటారు. ఇలా పెళ్లి స‌మ‌యంలో లేచిపోతున్న కేసులు ఈ మ‌ధ్య బాగా పెరుగుతున్నాయి. అయితే.. ఓ కార‌ణం వ‌ల్ల పెళ్లి ఆగిపోతే.. వ‌ధూవ‌రులు మాత్రం తాము క‌లిసే ఉంటామ‌ని మండ‌పం నుంచి లేచిపోయారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని వార‌ణాసిలో చోటుచేసుకుంది.

వ‌ధూవ‌రులు పెళ్లి దుస్తుల్లో బైక్‌పై పారిపోతున్న ఘ‌ట‌న స్థానికంగా తెగ వైర‌ల్‌గా మారింది. ముందు చాలా మంది పెళ్లి కూతుర్ని వేరొక అబ్బాయి లేపుకుపోతున్నాడేమో అనుకున్నార‌ట‌. తీరా ఆరా తీస్తే అత‌ను ఎవ‌రో కాదు పెళ్లి కొడుకే అని తెలిసి అంతా ఆశ్చర్యపోయార‌ట‌. వారు ఆశ్చ‌ర్యపోవ‌డంలో త‌ప్పు లేదులెండి. ఎందుకంటే ఈ మ‌ధ్య‌కాలంలో వ‌రుడు కానీ వ‌ధువు కానీ తాము ప్రేమించిన వారితో లేచిపోతున్న ఘ‌ట‌నల‌నే ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. అలాంటి వ‌ధూవ‌రులు లేచిపోవ‌డం వింత విష‌యం అయిపోయింది. ఇంత‌కీ ఈ లేచిపోయిన వ‌ధూవ‌రుల విష‌యంలో ఏం జ‌రిగిందంటే.. ముందు వీరి రెండు కుటుంబాలు సంబంధాన్ని ఖాయం చేసుకున్నాయి. వ‌ధువు కుటుంబీకులు వ‌రుడి త‌ల్లిదండ్రులు అడిగినంత క‌ట్నం ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. అలా హ్యాపీగా నిశ్చితార్ధం కూడా జ‌రిగిపోయింది.

నిన్న ఉద‌యం పెళ్లి జ‌ర‌గాల్సి ఉంది. ఈలోగా వ‌ధువు త‌ల్లిదండ్రులు వియ్యంకులు అడిగిన క‌ట్నం డ‌బ్బుని స‌ర్దుబాటు చేయ‌లేక‌పోయారు. ఇలాగైతే పెళ్లి కూడా జ‌ర‌గ‌దు అని వ‌రుడి త‌రఫు వారు వాద‌న‌కు దిగారు. దాంతో వధువు కుటుంబీకులు కట్నం అస‌లు ఇవ్వాల‌ని కూడా అనుకోవ‌డంలేదు.. క‌ట్నం డిమాండ్ చేసే ఇంటికి నా కూతురిని కాపురానికి పంప‌ను అని తేల్చి చెప్పేసారు. దాంతో మాటామాటా పెరిగి పెద్ద ర‌చ్చ జ‌రిగింది. ఈ గ్యాప్‌లో వ‌ధూవ‌రులు ప‌క్క‌కు పెళ్లి ఓ మంచి ప్లాన్ వేసుకున్నారు. ఎందుకంటే వారికి సంబంధం ఫిక్స్ అయినప్పుడే ఒకరికొక‌రు న‌చ్చేసారు. దాంతో ఎలాగైనా పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నారు. అయితే వ‌రుడు క‌ట్నం వ‌ద్దు అని త‌న త‌ల్లిదండ్రుల‌కు గ‌ట్టిగా చెప్ప‌లేక‌పోయాడు.

అలాగ‌ని తాను ఇష్ట‌ప‌డిన అమ్మాయిని కూడా వ‌దులుకోలేక త‌న ఫ్రెండ్స్ సాయంతో బైక్ ఏర్పాటు చేయించుకుని మండ‌పం నుంచి పారిపోయారు. ద‌గ్గ‌ర్లోని ఓ ఆల‌యానికి వెళ్లి త‌మ త‌ల్లిదండ్రులు వ‌చ్చి పెళ్లి ఆప‌క‌ముందే వ‌రుడు వ‌ధువు మెడ‌లో తాళి క‌ట్టేసాడు. ఈ వీడియోని వ‌రుడి త‌ర‌ఫు స్నేహితుడు ఒక‌డు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయ‌డంతో తెగ వైర‌ల్ అవుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ వీడియోను 2.4 మిలియ‌న్ మంది వీక్షించారు. క‌ట్నం కోసం కాపురాలు కూల్చుకుంటున్న ఈ రోజుల్లో ఇష్ట‌ప‌డిన అమ్మాయి కోసం వ‌రుడు తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల అంద‌రూ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి వ‌రుడు భ‌ర్త‌గా కావాలంటూ పెళ్లికాని అమ్మాయిలు తెగ కామెంట్స్ పెడుతున్నారు.