Delhi Murder: చంపి మంచిప‌ని చేసా.. నాకే బ్రేక‌ప్ చెప్తుందా?

Delhi: దిల్లీలో మైన‌ర్ బాలిక హ‌త్య ఘ‌ట‌న‌లో (delhi murder)  పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసారు. అయితే ఇంత దారుణానికి పాల్ప‌డిన నిందితుడు సాహిల్‌కి (shahbad dairy) ఏమాత్రం త‌ప్పు చేసాన‌న్న భావ‌న లేదు. ఎందుకు చంపాల్సి వ‌చ్చింది అని పోలీసులు విచారించ‌గా.. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నామ‌ని, కొన్ని రోజులుగా మాట్లాడ‌కుండా ఇగ్నోర్ చేస్తోందని అందుకే చంపాన‌ని అన్నాడు. ఇంత జ‌రిగినా చంపినందుకు ఏ బాధ లేద‌ని ధైర్యంగా చెప్తున్నాడు. దిల్లీలోని షాబాద్ డైరీ ప్రాంతంలో సాహిల్ ఏసీలు రిపేర్ చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన మైన‌ర్ బాలిక‌తో కొంత‌కాలంగా ప్రేమ‌లో ఉన్నాడు. ఆ అమ్మాయి కూడా సాహిల్‌ను ప్రేమించింది. కొంత‌కాలంగా వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతుండ‌డంతో ఆ అమ్మాయి సాహిల్‌కి బ్రేక‌ప్ చెప్పింది.

అయినా సాహిల్ ఆ బాలిక‌ను వద‌ల్లేదు. మాట్లాడాల‌ని వెంబ‌డించేవాడు. ఆదివారం రాత్రి ఆ బాలిక బ‌ర్త్‌డే పార్టీ కోస‌మ‌ని ఫ్రెండ్ ఇంటికి వెళ్తుండ‌గా.. సాహిల్ ఆమెను ఫాలో అయ్యాడు. అప్పుడు కూడా బ్రేక‌ప్ వద్దు అని ఆ అమ్మాయితో గొడ‌వ‌ప‌డ్డాడు. దాంతో ఇంకోసారి వెంట‌ప‌డితే పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాన‌ని ఆ అమ్మాయి బెదిరించింది. కోపంతో వెంట తెచ్చుకున్న క‌త్తితో దాదాపు 20 సార్లు దారుణంగా పొడిచాడు. అంత‌టితో ఆగ‌కుండా ఓ బండ‌రాయితో త‌ల‌పై ప‌లుమార్లు కొట్టాడు. అప్ప‌టికే ఆ బాలిక బ్లీడింగ్ ఎక్కువ అయిపోయి చ‌నిపోయింది. చుట్టుప‌క్క‌ల ఉన్న‌వారు సాహిల్‌ని ఆపాల‌ని ప్ర‌య‌త్నించినా అత‌ను విన‌క‌పోయేస‌రికి భ‌యంతో పారిపోయారు. సాహిల్ ఆ బాలికను చంపి ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని బులంద్‌షెహ‌ర్‌లో ఉంటున్న త‌న ఆంటీ ఇంటికి వెళ్లి దాక్కున్నాడు. దాదాపు 25 నిమిషాల పాటు ఆ బాలిక మృత‌దేహం ఘ‌ట‌నా స్థ‌లంలోనే ఉంది. దాంతో దిల్లీ పోలీస్ క‌మిష‌న‌ర్ ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటే చూస్తూ ఊరుకోకండి అని నిన్న ప్ర‌జ‌ల‌కు విన్న‌వించారు.