బాయ్‌ఫ్రెండ్‌తో మాట‌లొద్ద‌న్న తండ్రి.. కూతురి ఫిర్యాదు

Uttar Pradesh: బాయ్‌ఫ్రెండ్‌తో రోజూ మాట్లాడుతున్న కూతురిని మంద‌లించాడు ఓ తండ్రి. దాంతో ఆ అమ్మాయి ఏకంగా త‌న తండ్రిపైనే పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో (uttar pradesh) చోటుచేసుకుంది. అయోధ్య‌కు చెందిన 19 ఏళ్ల బాలిక రోజూ త బాయ్‌ఫ్రెండ్‌తో (boyfriend) రాత్రిళ్లు ఫోన్‌లో మాట్లాడుతోంది. అమ్మాయి తండ్రికి విష‌యం తెలిసి ప‌లుమార్లు హెచ్చ‌రించారు. అయినా ఆ అమ్మాయి విన‌లేదు. నిన్న రాత్రి కూడా ఆ అమ్మాయి ఫోన్‌లో మాట్లాడుతుండ‌డంతో త‌న ఫోన్ లాక్కున్నాడు. ఆమెపై చేయిచేసుకున్నాడు. పైగా ఇంట్లోవారికి కూడా త‌న‌పై ఓ క‌న్నేసి ఉంచాల‌ని అన్నాడు.

దాంతో విసిగిపోయిన ఆ అమ్మాయి ఈరోజు ఉద‌యం త‌న బాయ్‌ఫ్రెండ్‌ని ఏకంగా ఇంటికి పిలిపించింది. అత‌నితో క‌లిసి స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో కంప్లైంట్ ఇవ్వ‌డానికి వెళ్లింది. తానొక మేజ‌ర్‌న‌ని ఎవ‌రితోనైనా మాట్లాడే హ‌క్కు త‌న‌కు ఉంద‌ని కంప్లైంట్ ఇచ్చింది. ముందు అక్క‌డి పోలీసు అధికారి ఫిర్యాదులు వ‌ద్ద‌ని కౌన్సిలింగ్ ఇచ్చి పంపుతామ‌ని అమ్మాయికి న‌చ్చ‌జెప్పేందుకు య‌త్నించారు. అయినా ఆ అమ్మాయి విన‌లేదు. త‌న తండ్రి త‌న‌పై చేయిచేసుకుంటున్నాడ‌ని, త‌న ప్రైవ‌సీకి భంగం క‌లిగిస్తున్నార‌ని తెలిపింది. కంప్లైంట్ తీసుకోక‌పోతే పై అధికారుల‌కు వ‌ర‌కూ వెళ్తాన‌ని బెదిరించింది. దాంతో అమ్మాయి తండ్రిని స్టేష‌న్‌కు పిలిపించి ఫైన్ క‌ట్టించుకున్నారు. ఆ త‌ర్వాత అత‌నికి, ఇంట్లో వారికి కౌన్సిలింగ్ ఇప్పించి వ‌దిలేసారు.