Virat Kohli లేకపోవడం ఏ జట్టుకు అయినా పెద్ద ఎదురుదెబ్బే..!

Virat Kohli: ఇంగ్లాండ్ క్రికెట‌ర్ నాజర్ హుస్సేన్ (Nasser Hussain) భార‌త స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీపై ప్ర‌శంస‌లు కురిపించాడు. టీమిండియాకు కోహ్లీ అందించిన సేవ‌ల‌ను కొనియాడుతూ.. అలాంటి బ్యాట్స్‌మెన్ లేకపోవడం ఏ జట్టుకు అయినా పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాడు.

ఇంగ్లాండ్‌తో ఇప్పటికే రెండు టెస్టులు ముగిశాయి. తొలి టెస్టులో ఓడిన టీమ్.. రెండో టెస్టులో గెలిచి 1-1తో సిరీస్ ను సమం చేసింది. ఇక తర్వాతి టెస్టులకు విరాట్ కోహ్లి తిరిగి వస్తాడని ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు షాక్ తప్పేలా లేదు. రాజ్‌కోట్, రాంచీ టెస్టులకు కూడా విరాట్ దూరమైనట్లే అని ఈఎస్పీఎన్ క్రికిన్ఫో రిపోర్ట్ స్పష్టం చేసింది.

హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టు కోసం జనవరి 22న మిగిలిన టీమ్ తో కలిసి కోహ్లి నగరానికి వచ్చాడు. అయితే అదే రోజు సాయంత్రం తిరిగి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతడు వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ అనౌన్స్ చేసింది. అయితే ఆ వ్యక్తిగత కారణాలు ఏంటన్నది మాత్రం ఇప్పటికీ తెలియలేదు. అసలు కోహ్లి ఎక్కడ అన్నదానిపైనా స్పష్టత లేదు. ఇక ఐదో టెస్టుకు కూడా అనుమానమే అని ఈఎస్పీఎన్ క్రికిన్ఫో రిపోర్ట్ వెల్లడించింది. ఈ క్ర‌మంలోనే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీపై ప్ర‌శంస‌లు కురిపించాడు. కోహ్లీకి మద్దతు తెలుపుతూ వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాల‌ని నొక్కి చెప్పాడు.

టీమిండియాకు విరాట్ కోహ్లీ ఇప్ప‌టివ‌ర‌కు అందించిన సేవ‌ల‌ను నాసిర్ హుస్సేన్ ప్రశంసించాడు. అలాంటి బ్యాట్స్‌మెన్ లేకపోవడం ఏ జట్టుకు అయినా ఖచ్చితంగా పెద్ద ఎదురుదెబ్బేన‌ని పేర్కొన్నాడు. ‘విరాట్ కోహ్లి క్రికెట్ లో ఎలాంటి సిరీస్ ఆడిన ప్లేయ‌ర్ల‌లో.. అన్ని కాలాలలోనూ గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు. ప్రతి జట్టు కోహ్లీ వంటి ఆటగాడిని కోరుకుంటుంది. కోహ్లీ 15 సంవత్సరాలకు పైగా అంతర్జాతీయ క్రికెట్‌ను ఆడుతున్నాడు. అత‌నికి కూడా వ్య‌క్తిగ‌త జీవితం ఉంటుంది. కొంత కాలం పాటు అతని కుటుంబంతో కలిసి ఉండటానికి ఆట నుండి విరామం అవసరమైతే, విరాట్ కోహ్లీకి మ‌ద్దుతు ఇస్తూ.. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము” అని పేర్కొన్నాడు.

ఒకవేళ కోహ్లీ వచ్చే రెండు మ్యాచ్‌ల్లో ఆడకపోతే అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు టీమ్ ఇండియాకు అవసరం. కోహ్లి స్థానంలో రజత్ పాటిదార్‌ను ఎంపిక చేసినప్పటికీ, గత మ్యాచ్‌లో అతను ప్రభావం చూపలేకపోయాడు. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా కూడా గాయాల కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యారు. అయితే, కేఎల్ రాహుల్ ఫిట్‌గా ఉంటే అతను భారత బ్యాటింగ్‌ను మరింత బలోపేతం చేస్తాడ‌ని నాసిర్ హుస్సేన్ అన్నాడు.

అలాగే, కోహ్లీ-అతని కుటుంబం, అతని వ్యక్తిగత జీవితం మొదటి స్థానంలో ఉంటుందని చెప్పాడు. విరాట్ లేక‌పోవ‌డం భారత్‌కు దెబ్బ కావచ్చు, కానీ చాలా మంది యంగ్ ప్లేయ‌ర్లు ఉన్నారు. కేఎల్ రాహుల్ లేక‌పోతే.. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్‌ను ఆడించే అవకాశం కూడా భార‌త్ కు ఉంద‌ని తెలిపాడు.

అటు బౌలర్ల విషయానికొస్తే ముందు జాగ్రత్తగా విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టుకు పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ను పక్కన పెట్టారు. అతనిపై పని భారం ఎక్కువ అవుతుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడతడు మూడో టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు. రెండో టెస్టుకు అతని స్థానంలో వచ్చిన ముకేశ్ కుమార్ ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో మూడో టెస్టుకు తుది జట్టులో ఇద్దరు పేసర్లను తీసుకుంటారా? లేక నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. కాగా, ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో మూడో టెస్టు జరగనుంది.