ప‌దేళ్ల నిరీక్ష‌ణ త‌ర్వాత పుట్టిన బిడ్డ‌.. బ‌లిగొన్న విధి

bady born after 10 years of wait dies in accident

Viral News: పెళ్లై ప‌దేళ్లు అవుతున్నా క‌డుపు పండ‌లేద‌ని ఆ దంప‌తులు మొక్క‌ని దేవుళ్లు లేరు తిర‌గ‌ని హాస్పిట‌ల్స్ లేవు. ఇక పిల్ల‌లు క‌ల‌గ‌రేమో అని ఆశ‌లు వ‌దులుకున్న స‌మ‌యంలో ఆ త‌ల్లి కడుపు పండింది. పండంటి బిడ్డ‌కు జ‌న్మనిచ్చిన ఆ త‌ల్లిదండ్రుల ఆనందానికి అవ‌ధుల్లేవు. వారి సంతోషాన్ని చూసి విధికి క‌న్ను కుట్టిందేమో. ప‌చ్చ‌ని సంసారాన్ని కుదిపేసింది. యాక్సిడెంట్ రూపంలో ఆ బిడ్డ‌ను త‌ల్లిని బ‌లిగొంది.

ఈ దారుణ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లో చోటుచేసుకుంది. పుణెకి చెందిన అజ‌య్, మృణాళిని దంప‌తుల‌కు ఇటీవ‌ల పండంటి బిడ్డ పుట్టింది. ఈ నేప‌థ్యంలో వారు త‌మ కుటుంబంలోని మ‌రో ముగ్గురితో క‌లిసి స్థానిక అమ‌రావ‌తి ప్రాంతానికి వెళ్లి వ‌స్తున్నారు. వారి వాహ‌నం లింబే జ‌ల‌గావ్ గ్రామానికి చేరుకోగా.. ఇద్ద‌రు యువ‌కులు స్కార్పియో కారులో ఎదురుగా వ‌చ్చి వారి వాహనాన్ని ఢీకొన్నారు. ఈ ఘ‌ట‌న‌లో త‌ల్లి, బిడ్డ అక్క‌డిక‌క్క‌డే మృతిచెంద‌గా.. మిగ‌తావారు తీవ్ర గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ఆ యువ‌కులు ఇద్ద‌రూ తాగి వాహ‌నం న‌డుపుతున్నట్లు విచార‌ణ‌లో తేలింది. వాహ‌నం న‌డుపుతున్న వ్య‌క్తి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు. నిందితుల‌ను పోలీసులు వారిని క‌స్ట‌డీలో ఉంచారు.