యువ జంట ఆత్మహత్య!

ప్రేమని తమ పెద్దలు అంగీకరించలేదని మనస్తాపం చెందిన ఓ యువ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి రైల్వే గేటు వద్ద చోటుచేసుకుంది. చేబ్రోలు మండలం సెలపాడు గ్రామానికి చెందిన ఉయ్యూరు శ్రీకాంత్.. అదే గ్రామానికి చెందిన పులి త్రివేణి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. త్రివేణి తెనాలిలోని ఓ డిగ్రీ కళాశాలలో చదువుతోంది. అయితే రెండు రోజుల కిందట ఆమె కళాశాలకు వెళ్లి తిరిగి రాలేదు. ఈక్రమంలో శ్రీకాంత్‌ కూడా కనిపించలేదు. ఈ విషయం తెలుసుకున్న త్రివేణి తల్లిదండ్రులు మంగళవారం చేబ్రోలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సుద్దపల్లి రైల్వేగేటు వద్ద మృతదేహాలను గ్యాంగ్‌మెన్‌ గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు త్రివేణి తల్లిదండ్రులను సుద్దపల్లికి రమ్మన్నారు. తీరా రైల్వే ట్రాక్‌పై పడి ఉన్న మృతదేహాలను పరిశీలించిన త్రివేణి తల్లిదండ్రులు.. చనిపోయింది తమ బిడ్డేనని కన్నీరుమున్నీరుగా విలపించారు.