ఇన్‌ఫ్లుయెంజా, కొవిడ్‌ కేసులతో జాగ్రత్త – ప్రధాని మోదీ

2020 మార్చి 23న సరిగ్గా ఇదే రోజు భారత్‌లోకి కరోనా ప్రవేశించింది. ఈక్రమంలోనే మార్చి 22న ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత లాక్‌డౌన్‌ విధించారు. సరిగ్గా మళ్లీ అదే రోజున బుధవారం 2023 మార్చి 22 ప్రధాని వైరస్‌ల విస్తృతిపై అత్యున్నత స్థాయి సమావేశం ఢిల్లీలో నిర్వహించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలున్న వారిని గుర్తించేందుకు పరీక్షలను పెంచాలని, ల్యాబ్‌ సౌకర్యాలను విస్తరించాలని అధికారులను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ఇన్‌ఫ్లుయెంజా, కొవిడ్‌ కేసులను గుర్తించి పాజిటివ్‌ శాంపిళ్లను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపే ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీనివల్ల కొత్త వేరియంట్లను త్వరగా గుర్తించగలుగుతామని స్పష్టం చేశారు. గత రెండు వారాలుగా ఇన్‌ఫ్లుయెంజా, కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ఆయన సమీక్ష జరిపారు.

అప్రమత్తంగా ఉండాలి..
కరోనా కేసులను ఎదుర్కొనే సన్నద్ధత, ఆసుపత్రుల్లోని సౌకర్యాలు, మందుల రవాణా, టీకాల పంపిణీ, కొవిడ్‌ వేరియంట్లతో అత్యవసర పరిస్థితి తలెత్తితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం, దేశంపై పడే ప్రభావం వంటి వాటిపై మోదీ మాట్లాడారు. కొవిడ్‌ కేసులు పెరుగుతున్నందున ఆసుపత్రుల్లో రోగులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలని, వృద్ధులు, రద్దీ ప్రాంతాల్లో తిరిగేవారు మాస్కులను ధరించేలా ప్రోత్సహించాలని సమీక్షలో ప్రధాని పేర్కొన్నారు. దేశంలో రోజుకు సగటున 888 కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయని అధికారులు మోదీకి తెలిపారు. 20 ప్రధాన కొవిడ్‌ ఔషధాలు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే సన్నద్ధతపై మాక్‌ డ్రిల్‌ నిర్వహించామని ఆయనకు వివరించారు.