Ambani: కోడలికి ప్ర‌పంచంలోనే ఖ‌రీదైన కానుక‌!

Mumbai: భారతదేశ వ్యాపార దిగ్గజం ముఖేష్​ అంబానీ(Mukesh Ambani) ఏం చేసినా అట్టహాసంగానే ఉంటుంది. వారింట జరిగే ప్రతి వేడుకకి పెట్టే ఖర్చు వార్తల్లో నిలుస్తుంది. ఇషా అంబానీ(Isha Ambani) పెళ్లి, ఆకాశ్​ అంబానీ(Akash Ambani) పెళ్లితోపాటు, ముఖేష్​‌‌, నీతా అంబానీ(Nita Ambani)ల మనవడు పృథ్వీ ఆకాశ్​ అంబానీ పుట్టినప్పుడు కూడా ఈ కుటుంబం వార్తల్లో నిలిచింది. ఇక తాజాగా అంబానీ కుటుంబం ముంబైలో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో బాలీవుడ్​ సినీతారలంతా సందడి చేశారు. ఈ కార్యక్రమంలో అనంత్​ అంబానీ ధరించిన 18 కోట్ల రూపాయల విలువ చేసే గడియారం వార్తల్లో నిలిచింది. కాగా, తాజాగా అంబానీ ఇంటి పెద్ద‌ కోడలు శ్లోకా మెహతాకు(Shloka Mehta) ​ అంబానీ ఇచ్చిన బహుమతి ధర మరోసారి సంచలనంగా మారింది.

ఆకాశ్ పెళ్లికి నీతా అంబానీ దాదాపు రూ. 500 కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్‌ని తన కోడలు శ్లోకాకు పెళ్లి కానుకగా అందించారనే విషయం ప్రస్తుతం వైరల్​గా మారింది. అంతేకాదు ఈ నెక్లెస్​ ప్రపంచంలోనే అత్యంత విలువైన, దోష రహిత వజ్రాలతో ప్రత్యేకంగా రూపొందించినది. ఈ నెక్లెస్​ను లెబనీస్ ఆభరణాల వ్యాపారి మౌవాద్ రూపొందించారు. ఈ నెక్లెస్​లో అత్యంత విలువైన వజ్రంతో పాటు 91 వజ్రాలను పొదిగారు. ఈ వజ్రాల చుట్టూ సుమారు 200 క్యారెట్ల మెరిసే రాళ్లు జతచేశారు. ఇది అత్యంత ప్రత్యేకమైన డిజైన్​తో రూపొందించిన నెక్లెస్​ అని తెలుస్తోంది. ఈ నెక్లెస్ చ‌ర్చ నెట్టింట వైర‌ల్‌గా మారింది.