తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య

తల్లిదండ్రులు అన్నాక పిల్లలకు మంచి చెడులు చెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే వీటిని కొందరు పట్టించుకుని.. మంచి మార్గంలో నడుచుకుంటారు. కొందరు పెడచెవిన పెడుతుంటారు. మరి కొందరు మాత్రం మనస్తాపం చెంది అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. తల్లిదండ్రులు మందలించారనే కారణంలో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లికి చెందిన ఇంటర్‌ విద్యార్థిని సంగీత.. తల్లిదండ్రులు మందలించారని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు పేరెంట్స్‌ మందలించారని సంగీత సోమవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయింది. చుట్టుపక్కల ఎక్కడ వెతికినా కనిపించలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో బైరెడ్డిపల్లి చెరువులో ఓ యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలు సంగీతగా ఆమె తల్లిదండ్రులు గుర్తించి.. అక్కడే తల్లడిల్లిపోయారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయానికి వయసుకు వచ్చిన  తమ కుమార్తె దూరమైందని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.