కరోనాతో చనిపోయి.. రెండేళ్ల తర్వాత తిరిగొచ్చాడు!

Madhya Pradesh: కరోనా(Corona) కారణంగా 2021లోనే చనిపోయాడని డాక్టర్లు ధ్రువీకరించిన వ్యక్తి తిరిగొచ్చాడు. సినిమా కథను తలపిస్తున్న ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధార్(Dhar) జిల్లాలో చోటు చేసుకుంది. కమలేష్​ పాటిదార్(35)(Kamalesh Patidar)​ అనే వ్యక్తిని అనారోగ్యం కారణంగా కొవిడ్​ సెకండ్​ వేవ్ సమయం​లో గుజరాత్(Gujarat)​ రాష్ట్రంలోని వడోదర(Vadodara)లో గల ఓ ఆసుపత్రిలో చేర్చారు. అతను కొవిడ్​ సోకి చనిపోయినట్లు ధ్రువీకరించి శవాన్ని కూడా అప్పగించారు డాక్టర్లు. కుటుంబ సభ్యులు అతనికి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. కానీ రెండేళ్ల తర్వాత ఇప్పుడు అతను ఇంటికి తిరిగొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

కరోనా కారణంగా చనిపోయాడని డాక్టర్లు ధ్రువీకరించిన కమలేష్ పాటిదార్ దాదాపు రెండేళ్ల తర్వాత, కరోడ్కల గ్రామంలోని తన అత్త ఇంటికి వచ్చి తలుపు తట్టడంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. కరోనా సమయంలో కమలేష్​ చనిపోవడంతో అంత్యక్రియలు కూడా నిర్వహించామని, ఇప్పుడు అతను ఇలా తిరిగి రావడం ఆశ్చర్యంగా ఉందంటూ అతని బంధువు ముఖేష్ పాటిదార్ అన్నారు.  అయితే ఈ రెండేళ్లలో అతను ఎక్కడ ఉన్నదీ చెప్పడం లేదని తెలిపారు.