TTD: మే 24న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు

Tirupati: తిరుమల శ్రీవారి(ttd) ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను మే 24న విడుదల చేయనున్నట్లు టీటీడీ(ttd) ఓ ప్రకటనలో పేర్కొంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు సంబంధించిన జులై, ఆగస్టు నెలల కోటాను మే 24న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://tirupatibalaji.ap.gov.in లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.

తిరుమలలో భక్తుల రద్దీ..
శనివారం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనానికి 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 81,833 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఇక వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు సర్వదర్శన (టోకెన్‌ రహిత) భక్తులతో నిండిపోయిన క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది. వీఐపీ బ్రేక్‌ ముగిసిన తర్వాత సర్వదర్శన భక్తులకు వేగంగా దర్శనం కల్పించడంతో సాయంత్రానికి లైన్‌ నారాయణగిరి ఉద్యానవన షెడ్లకు చేరింది. వీరికి దాదాపు 20 గంటల దర్శన సమయం పడుతోంది. టైంస్లాట్‌ టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకు రెండు నుంచి మూడు గంటల దర్శన సమయం పడుతోంది. మరోవైపు తిరుమలలో గదులకు డిమాండ్‌ కొనసాగుతునే ఉంది. దాదాపు 3 గంటల తర్వాత గది లభిస్తోంది. శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, రోడ్లు, అన్నప్రసాద భవనం, లడ్డూ వితరణ కేంద్రం, అఖిలాండం, బస్టాండ్‌, కల్యాణకట్ట వంటి ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కాలినడక మార్గాల్లో భక్తుల సందడి అధికంగా ఉంది.