Punjab: స్వర్ణ దేవాలయం సమీపంలో పేలిన బాంబు!

Punjab: పంజాబ్‌ అమృత్‌సర్‌(Amritsar)లోని స్వర్ణ దేవాలయం(Golden Temple) సమీపంలోని దర్బార్ సాహిబ్ దగ్గర భారీ పేలుడు సంభవించింది.  శనివారం రాత్రి అకస్మాత్తుగా సంభవించిన ఈ పేలుడులో ఆరుగురు అమ్మాయిలు స్వల్పంగా గాయపడ్డారు. పేలుడు శబ్దం వినగానే ఆలయంలోని భక్తులు, స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఉగ్రదాడి(Terrorist attack) జరిగి ఉంటుందని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పేలుడు జరిగిన ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇది ఉగ్రదాడి కాదని చెప్పారు. పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. శాంతియుతంగా ఉండాలని సూచించారు.

అయితే, స్వర్ణ దేవాలయంలో బాంబు పేలుడు అంటూ వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పంజాబ్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ టీం పేలుడు జరిగిన ప్రదేశానికి వెళ్లింది. అక్కడ లభించిన కొంత పౌడర్‌ను స్వాధీనం చేసుకుంది. దీనిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని పోలీసులు పేర్కొన్నారు. స్వర్ణ దేవాలయంలో బాంబు పేలుడు అని వస్తున్న వార్తలన్నీ వదంతులేనని, వాటిని నమ్మవద్దని స్పష్టం చేశారు. ఈ పేలుడులో గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో స్థానికులకు ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించడం వల్ల భయాందోళనకు గురయ్యారు. కొన్ని రాళ్లు, గాజు ముక్కలు వచ్చి తమపై పడ్డాయని కొందరు యాత్రికులు వచ్చారని చెబుతున్నారు. ఈ పేలుడు కారణంగా పార్కింగ్ ఏరియాలో ఉన్న పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు.