Telangana Eamcet: తెలంగాణ‌లో ఎంసెట్ ప‌రీక్ష‌లు మొద‌లు

Hyderabad: తెలంగాణ(telangana) రాష్ట్రంలో బుధవారం నుంచి ఎంసెట్(eamcet) పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రెండు రోజులు అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగాలకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలకు 1,51,361 మంది హాజరవుతున్నారు. వీరి కోసం మొత్తం 137 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు రెండు షిప్టుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే.. ఈ ఏడాది కూడ నిమిషం ఆలస్యం అయినా.. పరీక్షకు అనుమతించమని అధికారులు పేర్కొన్నారు.

ఇక తెలంగాణలో పరీక్ష పత్రాల లీకేజే వ్యవహారంతో.. అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి విద్యార్థిని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత.. పరీక్ష గదిలోకి అనుమతిస్తున్నారు. ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు వెంట తెచ్చుకోవద్దని సూచించారు. ఆధార్ బెస్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటుందన్నారు. ఇక ఈ నెల 12,13,14 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన విద్యార్థులకు పరీక్ష జరగనున్నది. ఈ పరీక్షలకు 2,05,405 మంది హాజరు కానున్నారు.