Ichchapuram: కుప్ప కూలిన ‘బాహుదా’ బ్రిడ్జ్‌.. కారణం ఇదే!

vijayawada: : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం(Ichchapuram)లో బాహుదా నదిపై ఉన్న వంతెన(bahudha bridge collapse) బుధవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గ్రానైట్‌ రాళ్ల లోడుతో లారీ వెళ్తుండగా ఒక్కసారిగా వంతెన కూలింది. అయితే.. ఈ సమయంలో ఇతర వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒడిశాలోని అస్కా నుంచి ఒంగోలుకు గ్రానైట్‌ రాళ్ల లోడుతో ఓ లారీ వెళుతోంది. భారీ బరువుతో వచ్చే వాహనాలు సాధారణంగా జాతీయ రహదారి పైనుంచి వెళ్తుంటాయి. కానీ గ్రానైట్‌ లోడుతో వెళ్తున్న లారీ మాత్రం ఇచ్ఛాపురం పట్టణం మీదుగా వచ్చింది.
ఈ క్రమంలో బాహుదా నది వద్దకు చేరుకోగానే వంతెన బరువును తట్టుకోలేక.. ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో లారీ కిందికి నదిలోకి జారిపోయింది. ఇక నదిలో నీరు లేకపోవడంతో.. స్వల్ప గాయాలతో లారీ డ్రైవర్‌, క్లీనర్‌ ప్రాణాలతో బయటపడ్డారు.

మరోవైపు బ్రిడ్జి కూలిపోవడంతో నేరుగా ఇచ్ఛాపురం పట్టణంలోకి వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దానికి ప్రత్యామ్నాయంగా పోలీసులు జాతీయ రహదారి వైపు నుంచి బస్సులు, ఇతర వాహనాలను మళ్లిస్తున్నారు. కూలిపోయిన వంతెనను.. బాహుదా నదిపై 1929లో అప్పటి బ్రిటీష్‌ పాలనలో నిర్మించారు. గత కొన్నేళ్లుగా బ్రిడ్జి బలహీనపడుతూ వస్తోంది. ఈక్రమంలో ఒక్కసారిగా కూలిపోయింది. ప్రాణాపాయం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.