రేపు ఏపీ ఉద్యోగుల సెల్‌ఫోన్‌ డౌన్‌ కార్యక్రమం

ఏపీ అమరావతి ఉద్యోగ ఐకాస ఆధ్వర్యంలో గత నెల రోజులుగా ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. ఈక్రమంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. డిమాండ్ల సాధన కోసం మలిదశ ఉద్యమ కార్యాచరణకు వారు సిద్ధం అవుతున్నారు. దీనిలో భాగంగా.. రేపు(మంగళవారం) సెల్ ఫోన్‌ డౌన్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. ఏపీ జేఏసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన మలిదశ ఉద్యమ కార్యచరణలో భాగంగా.. ఈ నెల 11న ఒక్కరోజు ప్రభుత్వ ఉద్యోగులంతా సెల్ ఫోన్ వినియోగించకుండా విధులు నిర్వర్తించాలని.. ఉద్యోగులలో ఉన్న ఆవేదనను, నిరసనను ప్రభుత్వానికి తెలియజేసేలా ఈ కార్యక్రమాన్ని ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఉద్యోగి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం సెక్రటరీ జనరల్ పి.దామోదరరావు, తదితరులు పాల్గొన్నారు.