రీచార్జ్‌ చేయించలేదని 12 ఏళ్ల బాలుడు సూసైడ్‌!

తండ్రి లేకపోయినా ఇద్దరు పిల్లలను ఆ తల్లి కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తోంది. కూలినాలి చేసి ఇద్దరినీ చదివిస్తోంది. ఈనేపథ్యంలో కుమారుడు.. కేబుల్‌ టీవీ, సెల్‌ ఫోన్‌ రీచార్జి కోసం తల్లి డబ్బులు ఇవ్వలేదని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో చోటుచేసుకుంది. క్షణికావేశంలో ఆ పిల్లవాడు తీసుకున్న నిర్ణయం తల్లిని, అతని సోదరిని సోక సంద్రంలో ముంచివేసింది. కేవలం కేబుల్‌ టీవీ, సెల్‌ రీచార్జి కోసం నిండుప్రాణం బలితీసుకోవడం బాధాకరమని గ్రామస్తులు, చుట్టుపక్కల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి వివరాలు ఇలా…
మద్దులపల్లికి చెందిన గోగు అర్జయ్య, యశోద దంపతులకు కుమార్తె శరణ్య, కుమారుడు తరుణ్(12) ఇద్దరు పిల్లలు. మూడేళ్ల కిందట అర్జయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అప్పటి నుంచి ఇద్దరు పిల్లల ఆలనాపాలనా తల్లి చూసుకుంటూ వస్తోంది. పెద్ద కుమార్తె శరణ్య చిట్యాల గురుకులంలో తొమ్మిదో తరగతిలో ఉండగా, తరుణ్ సుందర్రాజ్ పేట జడ్పీహెచ్ఎస్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు. బుధవారం స్కూల్ నుంచి వచ్చిన తరణ్ సెల్ఫోన్, కేబుల్ టీవీ రీచార్జ్ కోసం తల్లిని డబ్బులు అడిగాడు. దీంతో యశోద కొడుకును మందలించింది. ‘చదువు గురించి పట్టించుకోవు గానీ ఇలాంటివి మాత్రం కావాలి’ అని కోప్పడింది. ఆ తర్వాత ‘నువ్వు చిన్న పిల్లాడివి. నీకేం తెలుసు. నేను రీచార్జ్ చేయిస్తాలే..’ అని చెప్పిసి బయటకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో తరుణ్ ఆవేశంగా ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి బయటకు రావాలని కోరారు. ఎంతకీ బయటికి రాకపోవడంతో తలుపులు పగల కొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే తరుణ్ ఉరి వేసుకుని ఉన్నాడు. కిందకి దించి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి లేకపోయినా రెక్కలు ముక్కలు చేసి పిల్లలను పోషించుకుంటున్న తనకు ఈ పరిస్థితి రావడమేమిటని యశోద గుండెలవిసేలా విలపిస్తోంది.