Liton Das: ఎంఎస్ ధోనీని తలపించిన బంగ్లా కీపర్.. వీడియో వైరల్..!

Liton Das: క్రికెట్​లో అందరూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అయితే అంతగా చర్చల్లోకి రాకున్నా మ్యాచ్​లో కీలక భాగంగా నిలిచే వాటిల్లో ఒకటిగా వికెట్ కీపింగ్​ను చెప్పొచ్చు. వికెట్ల వెనుక కాచుకొని క్యాచులు, స్టంపౌట్​లు, రనౌట్​లు చేయడమే గాక కెప్టెన్​తో పాటు బౌలర్లకు ఫీల్డింగ్ పొజిషన్స్ విషయంలో ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తుంటారు కీపర్లు. బ్యాటర్ల వీక్​నెస్​ను పసిగట్టడంలోనూ కీపర్లు ముందుంటారు. వరల్డ్ క్రికెట్​లో చాలా మంది గొప్ప కీపర్లు ఉన్నా అందరిలోనూ భారత లెజెండ్ ఎంఎస్ ధోని చాలా వైవిధ్యం. సంప్రదాయ శైలిలో కాకుండా నయా స్టైల్​లో కీపింగ్ చేస్తూ, డిఫరెంట్ రనౌట్స్, స్టంపౌట్స్​తో స్పెషల్​గా నిలిచాడు ధోని. వికెట్లకు దూరంగా ఉన్నా బాల్​ పట్టాడంటే కాళ్ల సందుల్లో నుంచి కూడా స్టంప్స్​ను పడేయడం అతడి ప్రత్యేకత. అలాంటోడ్ని మించిపోయాడో కీపర్. అతడే బంగ్లాదేశ్ ఆటగాడు లిటన్ దాస్.

ఫీల్డర్లు త్రోలు విసిరినా లేదా బ్యాట్స్​మన్​ కొట్టిన బాల్ పిచ్​కు సమీపంలోనే ఉన్నా దాన్ని అందుకొని ఎలాగైనా సరే వికెట్లకు విసురుతాడు ధోని. స్టంప్స్​కు వ్యతిరేక దిశలో ఉన్నా, వెనుక వైపు ఉన్నా కాళ్ల సందుల్లో నుంచి లేదా కాళ్ల పక్క నుంచి చూడకుండానే వికెట్లకు గురిచూసి కొట్టడం అతడి ప్రత్యేకత. అయితే బంగ్లా కీపర్ లిటన్ దాస్ అతడ్నే మించిపోయాడు. శ్రీలంకతో జరిగిన 3వ టీ20 మ్యాచ్​లో అతడు అద్భుతం చేశాడు. రన్ తీసేందుకు ప్రయత్నించిన లంక బ్యాటర్ దసున్ శనకను సూపర్బ్​గా రనౌట్ చేశాడు. క్రీజుకు దగ్గర్లోనే ఉన్న శనక ఈజీగా లోపలకు వచ్చేస్తానని భావించాడు. కానీ త్రోను అందుకున్న దాస్.. ధోని మాదిరిగా చేతులను శరీరానికి వెనుక వైపు నుంచి తీసుకొచ్చి వికెట్లను గురిపెట్టాడు. శనక క్రీజులోకి వచ్చే లోపు బంతి వెళ్లి వికెట్లను గిరాటేసింది.

ఏం జరుగుతుందో అర్థం అయ్యే లోపే శనక ఔట్ అయిపోయాడు. దీంతో బంగ్లా ఆటగాళ్లు సంతోషంలో మునిగిపోయారు. ఊహించని విధంగా రనౌట్ చేసిన దాస్​ను మెచ్చుకున్నారు. లిటన్ రనౌట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. అచ్చం ధోనీని దింపేశాడని అంటున్నారు. నెట్స్​లో విపరీతంగా ప్రాక్టీస్ చేయేడం, అదే టైమ్​లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, టైమింగ్ కుదిరితే తప్ప ఇలాంటి రనౌట్​ చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు. ఇవన్నీ ఉండటంతో పాటు వికెట్లను పడగొట్టగలననే ధీమా కూడా ఉండాలని అంటున్నారు.

కాగా, మూడో టీ20లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 174 పరుగులు చేసింది. ఓపెనర్ కుశాల్ మెండిస్ (86; 55 బంతుల్లో) టాప్ స్కోరర్. షనక (19; 9 బంతుల్లో) సాధించిన 19 పరుగులే రెండో అత్యధిక స్కోరు. బంగ్లా బౌలర్లలో రిషద్, తస్కిన్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ 19.4 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. రిషద్ హొస్సేన్ (53; 30 బంతుల్లో) అర్ధశతకంతో పోరాడాడు. 32 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన జట్టును ఆదుకున్నాడు. శ్రీలంక బౌలర్లలో నువాన్ తుషారా అయిదు వికెట్లతో సత్తాచాటాడు. అంతేగాక హ్యాట్రిక్ కూడా నమోదు చేశాడు. నజ్ముల్, తౌహిద్, మహ్మదుల్లాను వరుస బంతుల్లో ఔట్ చేశాడు.