ఫ్రిజ్‌లో పెట్టిన‌ నీళ్లు తాగుతున్నారా.. జాగ్రత్త!

ఎండాకాలం వచ్చిదంటే చాలు చల్లని నీళ్లు, పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు అంటూ శరీరాన్ని చల్లబరిచే పానీయాలపై దృష్టి పెడతారంతా. అయితే వేసవి ఉష్ణోగ్రతలు తట్టుకునేందుకు చల్లని వస్తువులను తీసుకోవడం అంత మంచిది కాదంటున్నారు నిఫుణులు. అంతేకాదు వేసవిలో చల్లని నీళ్లు తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఫ్రిజ్​లో నీరు తాగడం వల్ల ఇతర సమస్యలు కూడా ఎదురవుతాయంటున్నారు. అయితే సహజంగా చల్లగా ఉండే పుచ్చపండ్లు, తర్భూజ వంటివి ఒంటికి చలువ చేస్తాయి. అంతేకాదు వేసవి కాలంలో కుండలో నీరు తాగితే మంచిదంటున్నారు నిపుణులు. చెఱకు, పళ్ల రసాలు, ఫలుదాల్లోనూ ఐస్​ ఉపయోగించకుండా కుండ నీటితో చేసుకుని తాగితే మంచిదంటున్నారు.
ఎండలో చల్లని నీరు తాగడం వల్ల అప్పటికి కాస్త ఉపశమనంగా ఉన్నా తరువాత ఎదురయ్యే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఫ్రిజ్​లోని చల్లనినీరు తాగడం వల్ల గొంతు బిగుసుకుపోయి గొంతునొప్పి వస్తుంది. దీన్ని బ్రెయిన్ ఫ్రీజ్ అంటారు. ఆహారం తిన్న వెంటనే చల్లని నీరు తాగడం వల్ల శ్లేష్మం ఏర్పడి శ్వాస సంబంధ సమస్యలు వస్తాయి. కూల్ వాటర్ ఎక్కువగా తాగితే గుండెకు కూడా ప్రమాదకరమే. గుండెపోటు వచ్చేందుకు అవకాశాలుంటాయి. చల్లని నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ చెడిపోతుంది.
అంతేకాదు రోగనిరోధక వ్యవస్థ బద్ధకిస్తుంది. ఎండలో తిరిగి వచ్చినప్పుడు వ్యాయామం చేసినప్పుడు చల్లని నీరు తాగితే శరీరం డీ హైడ్రేడ్ అవుతుంది. అందుకే ఫ్రిజ్ వాటర్ తాగడం అంత సురక్షితం కాదని తెలిసినా తాగుతారు. వేసవిలో చల్లని కుండలో నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. మట్టి కుండలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మట్టి పాత్రల్లో వంట చేసుకుని తిన్నా ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు నిపుణులు. పూర్వకాలంలో మట్టిపాత్రల్లోనే వంట చేసుకునేవాళ్లు. మట్టిపాత్రల వల్ల కలిగే లాభాలు తెలుసుకుని స్మార్ట్​ యుగంలోనూ మట్టి పాత్రలపై మొగ్గు చూపుతన్నారు. ఈ కాలానికి తగినట్టు రకరకాల మట్టి పాత్రలు అందుబాటులోకి వచ్చాయి. కుండలు, కూజాలతోపాటు పాన్​లు, పెనాలు, గ్లాసులు, బాటిళ్లు, కుక్కర్లు కూడా మాడ్రన్​ కిచెన్​లో చక్కగా ఒదిగి పోతున్నాయి.