అరిటాకులో భోజనం చేస్తే ఎన్ని లాభాలో తెలుసా!

భారత సంస్కృతి, సంప్రదాయాల వెనుక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది నిపుణుల మాట. అరిటాకులో భోజనం చేయడం ప్రాచీన కాలం నుంచీ వస్తున్న సంప్రదాయం. కానీ ఆధునికత మోజులో పింగాణీ, స్టీల్​, పేపర్​ ప్లేట్ల మాయలోపడి అరిటాకు భోజనాన్ని దాదాపు మరిచిపోయారంతా. అయితే అరిటాకు భోజనమే శ్రేయస్కరమనే నమ్మకంతో చాలామంది ఇప్పటికీ పండగలు, వేడుకల్లో అరిటాకుల్ని వాడుతున్నారు. కొన్ని హోటళ్లు కూడా ప్రత్యేకంగా అరిటాకులో భోజనం వడ్డిస్తూ అసలైన తెలుగుదనాన్ని అందిస్తున్నాయి. అరిటాకు భోజనం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం..

పచ్చటి అరిటాకులో వేడి వేడి ఆహారపదార్థాలు వడ్డించడంవల్ల ఆకుపైన ఉండే పొర కరిగి అన్నంలో కలుస్తుంది. దీనివల్ల భోజనానికి మంచి రుచి వస్తుంది. దీంతో భోజనంలో చక్కని రుచిని ఆస్వాదించవచ్చు.అరిటాకుకులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. వేడి పదార్థాలు ఆ ఆకుపైన పెట్టుకుని తిన్నప్పుడు ఆకులోని విటమిన్లు అన్నీ మనం తినే ఆహారంలో కలిసి మంచి పోషకాలను అందచేస్తాయి. వేడి వేడి పదార్థాలు అరిటాకులో తినడం వల్ల కఫ, వాతాలు తగ్గి శరీరానికి బలం చేకూరుతుంది, ఆరోగ్యం చక్కబడుతుంది. శరీరం కాంతిమంతమవుతుంది. ఆకలి పుడుతుంది. ఎన్నో రకాల జబ్బులను నిరోధించే శక్తి అరిటాకులో ఉంది. అరిటాకుల్లో తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి. గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు ఉండవు.

అందానికి కూడా..

అరిటాకులో భోజనం చేయడం వల్ల అందులోని పోషకాలు శరీరంలోకి చేరి తద్వారా శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. వెంట్రుకలు నల్లబడతాయి. తెల్లని జుట్టు ఉన్నవారు అరిటాకులో భోజనం చేస్తుంటే వారి జుట్టు క్రమంగా నల్లబడుతుంది. అరిటాకులో భోజనం పెట్టినప్పుడు, ఒకవేళ విషాహారం పెడితే, అరిటాకు నల్లగా మారిపోతుంది. అన్నంలో విషం ఉందని బహిర్గతమైపోతుంది. అరిటాకుల్లో పాలీఫినాల్స్‌ ఉంటాయి. ఇవి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్‌ను కలిగి ఉంటాయి. వీటిపై వేడివేడి పదార్థాలు వడ్డిస్తే ఇవి కూడా భోజనంలో కలిసిపోతాయి. దీనివల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

అరటి పండ్లలోనే కాదు, అరటి ఆకుల్లోనూ పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఈ క్రమంలో అరిటాకులో భోజనం చేయడం వల్ల పొటాషియం అంది తద్వారా గుండె సంబంధ సమస్యలు రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. కిడ్నీకి సంబంధించిన వ్యాధులను దూరం చేయడంలో కూడా అరిటాకు ఎంతో ఉపయోగపడుతుంది.