YSRCP గుడిని మింగితే.. కూట‌మి లింగాన్ని మింగింది

ys sharmila slams kutami sarkar for liquor scam

YS Sharmila: గ‌త ప్ర‌భుత్వం ఓన్లీ క్యాష్ పేరుతో గుడిని మింగేస్తే.. ఇప్పుడున్న కూట‌మి స‌ర్కార్ ఏకంగా లింగాన్నే మింగేసింద‌ని వ్యాఖ్యానించారు APCC చీఫ్ వైఎస్ ష‌ర్మిళ‌.

“” ప్రభుత్వ పనుల్లో రాజకీయ జోక్యం వద్దని చెప్పిన చంద్ర‌బాబు నాయుడుగారు… మద్యం సిండికేట్లను అరికట్టడంలో రాజకీయ చోద్యం చూస్తున్నారు కదా? ఎక్కడికక్కడే అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై సిండికేట్లుగా ఏర్పడి మద్యం షాపులను దక్కించుకున్నారని తెలిసింది. కూటమి సిండికేట్లకే 3 వేలకు పైగా మెజారిటీ షాపులు దక్కాయంటే మీ పారదర్శకత, నిస్పాక్షికత ఎంత గొప్పగా ఉందో అర్థం అవుతుంది. మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల కనుసన్నల్లోనే టెండర్ల ప్రక్రియ సాగింది.

సాధారణ ప్రజలకు షాపులు దక్కకుండా రాష్ట్ర వ్యాప్తంగా బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రాణాలు పోతాయని హెచ్చరికలు చేశారు. కూటమి నేతలకు కాదని పొరపాటున ఎవరినైనా లాటరి చిక్కితే, లైసెన్స్ ఇస్తారా ? లేక 30 శాతం కమీషన్ ఇస్తారా ? లేకుంటే చస్తారా ? అంటూ బెదిరించారు. మమ్మల్ని కాదని మద్యం ఎలా అమ్ముతారో చూస్తాం అంటూ బహిరంగంగానే సవాళ్లకు పాల్పడ్డారు. సీఎం గారు! ఏసీ రూముల్లో కూర్చుని హెచ్చరికలు జారీ చేస్తే సరిపోతుందా? చర్యలు ఏవి? గత వైసీపీ “ఓన్లీ క్యాష్‌” అని గుడిని మింగేస్తే ఇప్పుడు మీరు లింగాన్ని మింగేస్తున్నారు.

ప్రైవేటు పేరుతో తక్కువ ధర అని చెప్పి, మద్యం ఏరులై పారించి, వేల కోట్లు దోపిడీకి కూటమి సర్కార్ తెరలేపింది.
అందుకేనేమో మీ పాపాల చిట్టాలు రేపు బయటపడకుండా ఉండటం కోసం, పాత సర్కారు మద్యం స్కాములోని పాపాలపుట్టలు బద్దలుకాకుండా జాగ్రత్త పడుతున్నారు “” అని విమ‌ర్శ‌లు గుప్పించారు.