KCR సెంటిమెంట్ పాలిటిక్స్ వ‌ర్క‌వుట్ అయ్యేనా?

Hyderabad: కర్నాటక ఎన్నికల ఫలితాలు(karnataka elections) ఇతర రాష్ట్రాలపై కొంత మేరకు ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఇక ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ(kcr), రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛండీగడ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల ఫోకస్ ఇప్పుడు ఆయా రాష్ట్రాలపై పడింది. ప్రధానంగా తెలంగాణలో అధికారంలో ఉన్న BRS ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌. మరోవైపు బీజేపీ కూడా రానున్న ఎన్నికల్లో తన ప్రాబల్యం పెంచుకోవాలని చూస్తోంది. ఈక్రమంలో కేసీఆర్‌ ఇద్దరు ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు సిద్దం అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు ఆయన పార్టీ అధికారంలోకి వచ్చింది.

అయితే.. తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించి.. రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడిన కాంగ్రెస్‌ మాత్రం అధికారం దక్కించుకోలేక పోయింది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఏ విధంగానైనా గెలుపొందాలని కాంగ్రెస్‌ చూస్తోంది. అందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్సీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలు చేస్తున్నారు. దీంతో పాటు BRS, BJP,ఇతర పార్టీల్లో ఉన్న అసమ్మతి నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించే పనిలో కాంగ్రెస్‌ ఉంది. దీంతో సీఎం కేసీఆర్ అలెర్ట్‌ అవుతున్నారు. కేడర్‌ను కాపాడుకుంటూనే.. రానున్న ఎన్నికల్లో గెలుపొందేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

ఇప్పటికే ఒక దఫా క్షేత్రస్థాయి లీడర్ల నుంచి మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఇక రేపు మరోసారి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులతో భేటీ అవుతున్నారు. కేసీఆర్ బీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా ప్రకటించినప్పటికీ.. తెలంగాణ ప్రజలకు మాత్రం.. ప్రాంతీయ పార్టీగానే పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణ సెంటిమెంట్‌ను వాడి మరోసారి ఎన్నికలకు వెళ్లనున్నట్లు సమాచారం.