Singareni Elections నుంచి BRS ఎందుకు త‌ప్పుకుంది?

Singareni Elections: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు లైన్‌ క్లియర్ అయిన‌ప్ప‌టికీ BRS పోటీ నుంచి త‌ప్పుకుని అంద‌రికీ షాకిచ్చింది. కేంద్ర లేబర్‌ కమిషనర్‌ ఎన్నికల తేదీ ప్రకటించగా, నామినేషన్ల ప్రక్రియ, గుర్తుల కేటాయింపు పూర్తయ్యింది. కార్మిక సంఘాలు ప్ర‌చారాలు కూడా మొద‌లుపెట్టేసాయి. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంధన కార్యదర్శి ఎన్నికను నిలిపివేయాల‌ని హైకోర్టులో మధ్యంతర పిటిషన్ వేసింది.

కానీ ఆ పిటిషన్‌ను గురువారం హైకోర్టు కొట్టివేసింది. దీంతో కార్మిక సంఘాలు, కార్మికులు హర్షం వ్యక్తం చేసున్నారు. సింగరేణి గుర్తింపు ఎన్నికల గడువు ముగిసి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ యాజమాన్యం ముందుకు వెళ్లడం లేదు. గత ప్రభుత్వ అండదండలతో పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చింది. ఎన్నికలు జరపాలని కార్మిక సంఘాలు ముక్తకంఠంతో కోరుతున్నప్పటికి పెడచెవిన పెట్టింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఏఐటీయూసీ హైకోర్టును ఆశ్రయించ‌డంతో ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

అయితే ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయొద్ద‌ని పార్టీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి KCR పార్టీ అనుబంధ TBGKS నేతలకు ఆదేశాలు జారీ చేసారు. దాంతో TBGKSకి చెందిన ముగ్గురు ప్ర‌ధాన అధికారులు క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు (kalvakuntla kavitha) రాజీనామా లేఖ‌లు సమ‌ర్పించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయినందుకే ఈ సింగ‌రేణి ఎన్నిక‌ల్లో పోటీ నుంచి త‌ప్పుకున్నార‌ని తెలుస్తోంది. సింగ‌రేణి ఎన్నికలు ఈనెల 27న జ‌ర‌గ‌నున్నాయి.