మే 20 నాటికి సర్వే పూర్తి చేయాలి – సీఎం జగన్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం కింద పత్రాల పంపిణీ, అదేవిధంగా మే 20 నాటికి సర్వే రాళ్లు వేసే పనితోపాటు అన్ని రకాలుగా సర్వే ప్రక్రియ పూర్తిచేయాలన్న సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అధికారులు ఆదేశించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో అమలవుతున్న ఈ పథకంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు చేపట్టిన పనులు ఎంతవరకు వచ్చాయి అన్న విషయాలను ఆయన తెలుసుకున్నారు. భూ సర్వే అనేది సాంకేతికతను ఉపయోగించి పూర్తి చేయడం అనేది దేశంలో ఎక్కడా జరగట్లేదని కేవలం ఏపీలోనే చేపట్టినట్లు సీఎం వివరించారు. ఇది ఇప్పటివారికే కాకుండా భవిష్యత్తు తరాలవారికీ కూడా చాలా ఉపయోగమని సీఎం పేర్కొన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు సర్వే ప్రక్రియను పూర్తిచేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు అత్యంత ఉపయోగకరమైన కార్యక్రమం అని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరూ టాంపర్ చేయలేని విధంగా పత్రాలు అందిస్తున్నామన్నారు. ఇక పనుల వేగవంతానికి అవసరమైనంతమేర రోవర్లను ఆర్డర్ చేయాలని సూచించారు. దీనివల్ల అనుకున్న సమయానికే సర్వే ప్రక్రియ పూర్తవుతుందని సీఎం అన్నారు. పనుల్లో జాప్యానికి తావు లేకుండా కావాల్సిన సాంకేతిక పరికరాలను తెప్పించుకోవాలని సీఎం ఆదేశించారు. రెవెన్యూశాఖ పరిధిలో తొలి దశలో చేపట్టిన 2వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే చాలావరకు పత్రాల పంపిణీ జరుగుతోందని అధికారులు వివరించారు.