Telangana: ప్రపంచ వేదికపై తెలంగాణ వ్యవసాయ ప్రగతి ప్రస్థానం

అమెరికాలో జరగనున్న నార్మన్ బోర్లాగ్  (norman E borlaug) ఇంటర్నేషనల్ డైలాగ్ సమావేశంలో పాల్గొనాల్సిందిగా తెలంగాణ (telangana) మంత్రి KTRకి ఆహ్వానం అందింది. తెలంగాణ వ్యవసాయ ప్రగతి ప్రస్థానంపై ప్రసంగించాల్సిందిగా KTRను ఆహ్వానించారు. తెలంగాణ వ్యవసాయ విధానాల నుంచి ఆహార భద్రత రంగంలో అనేక అంశాలు నేర్చుకునేందుకు వీలుందని నిర్వాహ‌కులు తెలిపారు. వ్యవసాయ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన శాస్త్రవేత్త, ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ ఈ బోర్లాగ్ పేరిట ఏర్పాటు చేసిన బోర్లాగ్ ఇంటర్నేషనల్ డైలాగ్ సమావేశంలో గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన అద్భుతమైన వ్యవసాయ ప్రగతి ప్రస్థానాన్ని KTR ప్ర‌సంగించ‌నున్నారు.

అక్టోబర్ 24 నుంచి 26వ తేదీ వరకు అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలోని డేస్మోయిన్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ సంవత్సరం జరగనున్న బోర్లాగ్ డైలాగ్ సమావేశంలో స్థిరమైన, సమానమైన, పోషణ క‌లిగిన‌ ఆహార వ్యవస్థను సాధించడానికి పరివర్తన పరిష్కారాలు అనే ప్రధాన ఇతివృత్తం ఆధారంగా చర్చలు కొనసాగనున్నాయి. ప్రపంచ దేశాలకు చెందిన 1200 మంది అతిథులు ఈ సమావేశానికి నేరుగా హాజరవుతారు. దీంతో పాటు వేలాదిమంది సామాజిక మాధ్యమాల ద్వారా ఈ సమావేశాల్లో పాల్గొంటారు. వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన విస్తృతస్థాయి చర్చలను ప్రతి ఏటా ఈ సమావేశాల్లో చర్చిస్తారు. (telangana)

తెలంగాణ రాష్ట్ర అనుభవాలను ఈ సమావేశంలో చర్చించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ సమావేశాలకు హాజరవుతున్న అనేకమందికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని మంత్రి KTRకు పంపిన ఆహ్వాన పత్రంలో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అధ్యక్షులు టెర్రి ఈ బ్రాడ్ స్టాడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యవసాయ ప్రగతి కోసం రాష్ట్రం అనుసరించిన విధానాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించడం ద్వారా ప్రపంచ ఆహార భద్రతను మరియు సరఫరాను పెంచడం, ప్రపంచ ఆహార కొరతను ఎదుర్కోవడం వంటి కీలకమైన అంశాల పట్ల ఒక విస్తృతమైన అవగాహన ఏర్పడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని వివరించాలని మంత్రి KTRకు పంపుతున్న ఆహ్వానం ఈ సమావేశానికి గౌరవాన్ని అందిస్తుందని టెర్రీ తెలిపారు.

ఈ ఆహ్వానం పట్ల మంత్రి KTR సంతోషం వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి KCR ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలలో రాష్ట్రం వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఎన్నో వినూత్నమైన, విప్లవాత్మకమైన కార్యక్రమాలను అనుసరించిందని వాటి ప్రతిఫలాలను ఈరోజు తెలంగాణ రైతాంగం అందుకుంటున్నదని, ఆహార భద్రత అంశంలో దేశానికి కూడా తెలంగాణ రాష్ట్రం భరోసాగా నిలుస్తుంది అన్నారు. ఇంతటి విజయవంతమైన తెలంగాణ వ్యవసాయ నమూనాను అంతర్జాతీయ వేదిక పైన వివరించాలని వచ్చిన ఆహ్వానం తెలంగాణ రాష్ట్ర విధానాలకు దక్కిన గౌరవంగా ఆయన అభివర్ణించారు. మంత్రి KTR తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి కూడా ఆహ్వానం అందింది. (telangana)