Teenmaar mallanna: కొత్త పార్టీ పెడుతున్నా..!

Hyderabad: తీన్మార్ మల్లన్న(teenmar mallanna)కు మల్కాజ్ గిరి న్యాయస్థానం(malkajgiri court) బెయిల్ మంజూరు(bail issued) చేసింది. మల్లన్నతో పాటు క్యూ న్యూస్ స్టాఫ్ట్ సుదర్శన్ గౌడ్, బండారు రవీందర్, ఉప్పల నిఖిల్, సిర్రా సుధాకర్, చింత సందీప్ కుమార్ లకు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఒక్కొక్కరి దగ్గర రూ.20వేల ష్యూరిటీని పూచీకత్తుగా తీసుకుని బెయిల్ మంజూరు చేయగా.. మంగళవారం రాత్రి వారందరూ విడుదలయ్యారు. అనంతరం బయటకు వచ్చిన తీన్మార్‌ మల్లన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. కేసీఆర్‌ పోలీసు సెక్షన్లను నమ్ముకున్నాడని… తాను వీకర్స్‌ సెక్షన్స్‌ని నమ్ముకున్నానన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు వెల్లడించారు. తన పార్టీ పేరు ‘తెలంగాణ నిర్మాణ పార్టీ'(telangana nirmana party) అని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తానని పేర్కొన్నారు. ఇక జైలు నుంచి విడుదలైన మల్లన్నకు ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. మల్లన్న విడుదల సందర్భంగా ఆయన అభిమానులు బాణసంచాతో సంబరాలు నిర్వహించారు. జైలు నుంచి మల్లన్న విడుదలైన తర్వాత ర్యాలీ తీశారు. అనేక మంది అభిమానులు ఆయతో సెల్పీ దిగేందుకు పోటీ పడ్డారు.

మల్లన్నపై మేడిపల్లి పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఇందులో క్రైం నెంబర్ 294, క్రైం నెంబర్ 299 రెండింటిలో మల్లన్నకు న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. 3 నెలల పాటు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య మేడిపల్లి పోలీసుల ముందు హాజరుకావాలని షరతు విధించింది. మల్లన్నను మార్చి 21న మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు నెల రోజుల తర్వాత మల్లన్న మంగళవారం విడుదలయ్యారు.