YCP Stickers: ఏపీలో స్టిక్కర్ వార్..!

Vijayawada: విజయవాడకు చెందిన రమేష్‌.. తన ఇంటికి కొత్తగా రంగులు వేయించాడు. గోడలపై దుమ్ముధూళి అంటకుండా చక్కగా చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో YCP ”మా నమ్మకం నువ్వే జగన్” పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీంతో రమేష్‌ ఇంటికి కూడా వచ్చి వైసీపీ వారు ఓ మూడు నాలుగు స్లిక్కర్లు వేశారు. ఇది ఇలా ఉండగా.. ఓ గంట అటూ ఇటుగా జనసేనకు చెందిన కార్యకర్తలు రమేష్‌ ఇంటికి వచ్చారు.. జనసేన పార్టీ స్టిక్కర్‌ అంటించాలని కోరారు. వీరితో ఎందుకొచ్చిన గొడవలే అంటించమన్నారు. వాళ్లు ఏకంగా ఆరు స్టిక్కర్లు ఎక్కడపడితే అక్కడ గోడలపై అంటించి వెళ్లిపోయారు. పెయింటింగ్‌ అంతా పోతుంది అని దిగాలుగా కూర్చున్నాడు రమేష్‌. ఇక సాయంత్రానికి టీడీపీకి చెందిన నాయకులు ఆయన ఇంటికి వచ్చారు. రెండు పార్టీలకు చెందిన స్టిక్కర్లు ఎలాగూ వేయించుకున్నావ్‌ కదా తమ పార్టీ స్టిక్కర్‌ కూడా వేయించుకోవాలని కోరారు. ఇద్దరికి అవకాశం ఇచ్చి మూడో వాడిని వద్దంటే ఇబ్బంది అనుకుని.. సరే మీ ఇష్టం వచ్చిన చోట అంటించుకోండి అని చిరు కోపంతో రమేష్‌ ఇంట్లోకి వెళ్లిపోయాడు. దీంతో టీడీపీ వాళ్లు కూడా ఆరు పైన స్టిక్కర్లు వేసి వెళ్లిపోయారు. దీంతో రమేష్‌ ఇళ్లు కాస్త.. సినిమా హాల్‌ను తలపించేస్తోంది. ప్రస్తుతం పార్టీల మధ్య కొనసాగుతున్న స్టిక్కర్ల వార్‌ కాస్త.. ప్రజలపైకి మళ్లింది. దీంతో ప్రజలు ఎవరికీ నో చెప్పలేని పరిస్థితి నెలకొంది.