Revanth Reddy: 100 రోజుల పాల‌న‌.. ప్ర‌తి నిమిషం అదే ఆలోచ‌న‌

Revanth Reddy: తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చి ఈరోజు 100 రోజులు పూర్తైంది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వ‌హించారు. 100 రోజుల పాల‌న త‌న‌కు పూర్తి సంతృప్తినిచ్చింద‌ని తెలిపారు.

“”” వందరోజుల్లో ప్రతి నిమిషం ఆరు గ్యారంటీల అమలుకు కృషి చేసాం. KCR రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచారు. గత పాలనలో చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుతూ ముందుకు వెళుతున్నాం. ముందు ముందు ఇంకా బాధ్యతతో అపరిష్కృత సమస్యలను పరిష్కరిస్తాం. ఆరు గ్యారంటీలను మరింత సమర్ధవంతంగా అమలు చేస్తాం. మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలను భర్తీ చేసి మా ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. నిరుద్యోగులకు ఒక విశ్వాసం కల్పించే ప్రయత్నం చేశాం. ప్రతీ నెలా ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు వచ్చేలా చర్యలు తీసుకున్నాం. ప్రజా భవన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. సమస్యలు పరిష్కరిస్తున్నాం. సచివాలయం నిషేధిత ప్రదేశంలా గత ప్రభుత్వం వ్యవహరించింది. కానీ మేం సచివాలయంలోకి అందరికీ ప్రవేశం కల్పించే స్వేచ్ఛ ఇచ్చాం. మేం పాలకులం కాదు.. ప్రజా సేవకులం అని ప్రజలకు తేల్చి చెప్పాం. ప్రజా సంఘాలతో ప్రభుత్వ నిర్ణయాలపై సలహాలు స్వీకరించాం.

ఈ ప్రభుత్వంలో అందరినీ భాగస్వాములను చేస్తున్నాం. మార్పు మొదలైంది.. మార్పు జరుగుతోంది అని ప్రజలకు నమ్మకం కలిగిస్తున్నాం. విభజన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటున్నాం. తెలంగాణ హక్కుల సాధన కోసం ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తున్నాం. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సంప్రదింపులు జరుపుతున్నాం. కేంద్రంతో, పక్క రాష్ట్రాలతో గిల్లికజ్జాలు పెట్టుకోవడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగిస్తున్నాం. జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదించుకున్నాం. తెలంగాణ అభివృద్ధికి మా మంత్రులు, ఎమ్మెల్యేలు కష్టపడి పని చేస్తున్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి వైబ్రాంట్ తెలంగాణ-2050 మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం“” అని తెలిపారు.(Revanth Reddy)

క‌విత అరెస్ట్‌పై స్పందించిన సీఎం

“”” లిక్కర్ స్కామ్ వ్యవహారం టీవీ సీరియల్ ఎపిసోడ్స్‌లా సాగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ కు 24 గంటల ముందు కవితను అరెస్టు చేశారు. కవిత అరెస్టు ఎన్నికల స్టంట్. సానుభూతితో బీఆరెస్.. అరెస్టు చర్యలతో బీజేపీ ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నాయి. కవితను అరెస్టు చేసే సమయంలో కేసీఆర్ అక్కడకు రాకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పటి వరకు కేసీఆర్ అరెస్టును ఖండిచలేదు… ప్రజలకు వివరణ ఇవ్వలేదు. కేసీఆర్ మౌనం దేనికి సంకేతం? నిన్న ఈడీ.. మోడీ కలిసే రాష్ట్రానికి వచ్చారు. రాజకీయంగా కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికే బీఆరెస్, బీజేపీ డ్రామాలు. డ్రామాలు కట్టిపెట్టి మోదీ తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి. విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదో.. మెట్రో విస్తరణకు ఎందుకు అనుమతి ఇవ్వలేదో చెప్పాలి. చెప్పుకోవడానికి ఏమీ లేకనే బీజేపీ అరెస్ట్ డ్రామాకు తెర తీసింది.

కాంగ్రెస్‌ను దొంగ దెబ్బ తీయడానికి బీఆరెస్, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం ఇది. వీరిద్దరి నాటకాన్ని తెలంగాణ సమాజం గమనించాలి. అరెస్టు విషయంలో కేసీఆర్, మోదీ మౌనం వెనక వ్యూహం ఏమిటి? మా ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేయడం మోదీ స్థాయికి తగదు. తెలంగాణను అవమానించిన మోదీకి తెలంగాణ అనే పదం పలకడానికి కూడా అర్హత లేదు. పదేళ్ల కేసీఆర్ అవినీతిపై ఎందుకు విచారణ చేయలేదో బీజేపీ నాయకులు సమాధానం చెప్పగలరా?కాళేశ్వరంపై మేం జ్యుడీషియల్ విచారణ చేయిస్తున్నాం. విచారణ నివేదికల ఆధారంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం. మా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడదు… అక్రమాలకు పాల్పడిన వారిని ఎవరినీ వదలం.

ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే.. వాళ్లు నిద్ర లేచేలోగా పక్కన ఎవరూ ఉండరు.. మీరు పడగొట్టాలని అనుకుంటే.. నిలబెట్టేందుకు మా ప్రయత్నం మేం చేస్తాం.. పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండటం ఖాయం… నలభై ఏళ్లు రాజకీయ అనుభం ఉన్న KCR.. నల్లగొండ సభలో ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు సమర్ధించుకుంటారా? KCR అహంకారం ఇంకా తగ్గలేదు.. పార్లమెంట్ ఎన్నికలు మా పరిపాలనకు రెఫరెండం “”” అని తెలిపారు.