ys viveka case: అవినాష్ రెడ్డికి ఊర‌ట‌!

Hyderabad: వైఎస్‌ వివేకా హత్య కేసు(ys viveka case) విచారణకు సంబంధించి ఎంపీ అవినాష్‌ రెడ్డి(mp avinash reddy) హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఇవాళ ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. అనంతరం హైకోర్టు(telangana high court).. సీబీఐకి పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. అవినాష్‌ రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. కానీ సీబీఐ విచారణకు అవినాష్‌ రెడ్డి హాజరు కావాలని సూచించింది. అయితే.. అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించలేదు. ఇక సీబీఐ విచారణ చేపట్టే సమయంలో.. అవినాష్ విచారణను ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్‌పై ఈ నెల 25న హైకోర్టు తుదితీర్పు ఇవ్వనున్నట్లు పేర్కొంది.

మరోవైపు సునీత రెడ్డి దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిష‌న్‌పై కూడా వాదనలు జరిగాయి. ఒకానొక దశలో సునీతరెడ్డి లాయర్, అవినాష్ రెడ్డి లాయర్ మధ్య వాగ్వాదం నడిచిందని సమాచారం. సునీత మాత్రం అవినాష్‌ బెయిల్ విషయంతో హైకోర్టు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని కోరుతోంది. ఇక ఇది ఇలా ఉండగా.. వివేకా కేసులో అరెస్టయిన ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను రేపు పోలీసు కస్టడీకి తీసుకుంటారని.. సీబీఐ తరపు న్యాయవాది తెలిపారు. వాళ్ళతో కలిపి అవినాష్‌ను కూడా విచారించాల్సి ఉందన్నారు. కేసుకు సంబంధించి చాలా విషయాలపై స్పష్టత తీసుకోవాల్సి ఉందని సబీఐ చెబుతోంది. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు విచారణ కొనసాగుతుందని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో A6 ఉదయ్ రెడ్డి, A7 భాస్కర్‌రెడ్డికి ఆరు రోజుల కస్టడీ అనుమతి ఇచ్చిన నాంపల్లి కోర్టు… రేపటి నుంచి 24 వరకు కస్టడీకి తీసుకుని సీబీఐ అధికారులు విచారణ చేయనున్నారు.