Posani: దేవుళ్ల‌నైనా మారుస్తాను కానీ జ‌గ‌న్‌ను మాత్రం వీడ‌ను

posani comments on chandrababu naidu

Posani: తాను కొలిచే దేవుళ్ల‌నైనా మారుస్తానేమో కానీ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మాత్రం వీడ‌న‌ని అన్నారు పోసాని కృష్ణ‌ముర‌ళి. జ‌గ‌న్ తిరుమ‌ల వెళ్తానంటే డిక్ల‌రేష‌న్ అడుగుతున్నార‌ని.. ఇదే చంద్ర‌బాబు నాయుడు గ‌తంలో అయ్యప్ప భ‌క్తులు 40 రోజులు దీక్ష‌లో ఉంటే మ‌ద్యం అమ్మ‌కాలు జ‌ర‌గ‌వ‌ని వ్యాఖ్య‌లు చేసార‌ని అన్నారు.

ఆన్ రికార్డు కానీ ఆఫ్ రికార్డు కానీ జ‌గ‌న్ ఎప్పుడూ కూడా హిందువుల గురించి కానీ ఇత‌ర మ‌తాల గురించి కానీ తప్పుగా మాట్లాడ‌లేద‌ని అన్నారు. తాను గ‌తంలో పరుచూరి బ్ర‌ద‌ర్స్ వ‌ద్ద అసిస్టెంట్‌గా ప‌నిచేస్తున్న‌ప్పుడు వారి కొడుక్కి క్యాన్స‌ర్ ఉంద‌ని తెలిసి ఓ మ‌సీదుకి వెళ్లాన‌ని.. ఆ స‌మ‌యంలో ముస్లిం సోద‌రులు కూడా త‌న బాధ తెలుసుకుని ఆ అబ్బాయి కోసం రోజూ న‌మాజ్ చ‌దివి హాస్పిటల్‌కి వ‌చ్చి మ‌రీ బొట్టు పెట్టేవార‌ని అన్నారు. తాను ఎన్నో చ‌ర్చిల‌కు వెళ్లాన‌ని.. ఏ మ‌తం వారు త‌న‌ను ఇప్ప‌టివ‌ర‌కు డిక్ల‌రేష‌న్లు అడ‌గ‌లేద‌ని తెలిపారు.

చంద్ర‌బాబు నాయుడు గ‌తంలో మోదీ గురించి ముస్లిం సోద‌రుల‌తో అన‌వ‌స‌రంగా ఆ మ‌త‌పిచ్చి పార్టీలో చేరాన‌ని.. ఇంకెప్పుడూ మోదీతో చేతులు క‌ల‌ప‌నని అన్నారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ మోదీ అవ‌స‌రం వ‌చ్చి అమిత్ షా కాళ్లు ప‌ట్టుకుని మ‌రీ పొత్తులో భాగ‌మ‌య్యాడ‌ని ఆనాడు అమిత్ షాను దొంగ అని ఈరోజు దొర అంటున్నాడ‌ని విమ‌ర్శించారు. ఎన్ని అబ‌ద్ధాలైనా చెప్పుకో.. నువ్వే సీఎంగా ఉండు.. ఎన్ని నాట‌కాలైనా ఆడు. కానీ ద‌య‌చేసి మ‌త‌క‌ల్లోలాలు సృష్టించ‌ద్దు చంద్ర‌బాబు అంటూ రిక్వెస్ట్ చేసారు పోసాని.