BRSతో లెఫ్ట్‌ పార్టీలు కటీఫ్‌.. కారణం ఇదే!

Hyderabad: BRS, వామపక్షాలు రానున్న ఎన్నికల్లో (telangana elections) కలిసి పోటీ చేస్తాయా లేదా అన్నది సందిగ్దంగా మారింది. మునుగోడు ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీలు కలిసి పనిచేసిన దాఖలాలు లేవు. మునుగోడు ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ (brs), లెఫ్ట్‌ పార్టీలతో పొత్తు పొడిచింది. అప్పట్లో అక్కడ ఉన్న బీజేపీ (bjp) అభ్యర్థిని ఓడించేందుకు రెండు పార్టీలు సమన్వయంతో పనిచేశాయి. కానీ ఈ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఎవరికి వారే అన్నట్లు నడుచుకుంటున్నారు. వాస్తవానికి మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవడానికి వామపక్షాల మద్దతు బీఆర్‌ఎస్‌కు కలిసి వచ్చింది. దీంతో గెలుపు సునాయాసంగా మారింది. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శతృవులు ఉండరు అన్న చందంగా.. బీఆర్‌ఎస్ (brs) మునుగోడు ఎన్నికల వరకు లెఫ్ట్‌ పార్టీలను వాడుకుంది అని పలువురు చెబుతున్నారు. అందుకే బీజేపీకి వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు కలిసి ఒకే వేదికపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు.

BRS ఒంటరిగా వెళ్లడానికి కారణం అదే..
తెలంగాణ (telangana) రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్ రెండు దఫాలు ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే గెలుపొందింది. ఇక మూడో సారి కూడా అదేవిధంగా ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది. ఒకవేళ వామపక్షాలతో పొత్తుపెట్టుకుంటే.. బీఆర్‌ఎస్‌ బలహీనపడిందని ప్రతిపక్షాలు వ్యాఖ్యలు చేసే వీలుంది. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే ఆ పార్టీకి ఇబ్బందే అందుకే ఒంటరిగా బీఆర్‌ఎస్ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. దీంతోపాటు పొత్తు ఉంటే.. వామపక్షాలు కొన్ని జిల్లాల్లో అధిక సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. కాస్తో కూస్తో… పట్టున్న ఖమ్మం జిల్లా మొత్తం తమకే ఇవ్వాలని లెఫ్ట్ నాయకులు ఆశలు పెట్టుకుంటున్నారు. ఆ జిల్లాతోపాటు ఇతర జిల్లాల్లో సీట్లు అడుగుతున్నారు. దీంతో బీఆర్‌ఎస్ కు అసలుకే మోసం వస్తుందని గ్రహించి పొత్తు గురించి మౌనంగా ఉంది. దీన్ని బట్టి వారి మధ్య ఇక పొత్తు లేనట్లే అని స్పష్టం అవుతోంది.