AP Elections: చ‌రిత్ర తిర‌గ‌రాసే అవ‌కాశం.. జ‌గ‌న్‌ను గెలిపిస్తుందా?

AP Elections: క్లాస్‌లో ఎవ‌డైనా స‌మాధానం చెప్తాడు.. కానీ ఎగ్జామ్‌లో రాసేవాడే టాప‌ర్ అవుతాడు అన్న‌ట్టు.. ఎన్నిక‌ల బ‌రిలో అంద‌రూ గెల‌వాల‌నే చూస్తారు. కానీ అవ‌తలి వైపు ఎంత బ‌లంగా ఉన్నా వారిని ఢీకొట్టి మ‌రీ గెలిచినోడే చ‌రిత్ర‌లో నిలిచిపోతాడు. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఇదే ప‌రిస్థితి ఉంది. ఫ‌లానా నేత గెలుస్తాడా లేదా అనేది ప్ర‌జ‌ల చేతిలో ఉంటుంది. ప్ర‌జ‌లు ఏ ఉద్దేశంతో ఓటు వేసి గెలిపించినా చివ‌రికి వారి నిర్ణ‌య‌మే ఫైన‌ల్.

ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారిక పార్టీ అయిన YSRCPపై నాలుగు పార్టీలు ప‌డ‌గ విప్పాయి. తెలుగు దేశం పార్టీ, జ‌న‌సేన‌, భార‌తీయ జన‌తా పార్టీ, కాంగ్రెస్. ఇందులో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తెలుగు దేశం పార్టీ మాత్ర‌మే. ఈ పార్టీ వ‌ల్ల జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీలు చేతులు క‌లిపి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని గ‌ద్దె దించాల‌ని చూస్తున్నాయి. మ‌రోప‌క్క జ‌గ‌న్ సొంత చెల్లెలు అయిన వైఎస్ ష‌ర్మిళ‌.. రాష్ట్ర కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా మారి తాను గెల‌వ‌క‌పోయినా అన్న మాత్రం గెల‌వ‌కూడ‌ద‌ని ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఇలా ఒకే ఒక్క వ్య‌క్తిని తొక్కేయాల‌ని నాలుగు పార్టీలు న‌డుం బిగించి ప‌నిచేయ‌డం మొద‌టిసారి చూస్తున్నామ‌నే చెప్పాలి. అందరినీ క‌లిపి ఒకేసారి ఎదుర్కొనే సువర్ణావకాశం అన్ని సార్లు రాదు. కానీ అలా వచ్చినప్పుడు కొడితేనే చరిత్రలో నిలిచిపోతారు. ఈసారి ఆ అవకాశం జగన్‌కి వ‌చ్చింది. మ‌రి ఈ అవ‌కాశం ఆయ‌న్ను గెలిపిస్తే ఇక జ‌గ‌న్‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎదురే లేద‌ని చెప్పొచ్చు. అలా కాక‌పోతే మాత్రం జ‌గ‌న్ పార్టీ డీలా ప‌డిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ జ‌గన్ పార్టీలోని చాలా మంది ఆయ‌న టికెట్ ఇవ్వ‌లేద‌ని నిరుత్సాహంతో ఉన్నారు. వారిలో కొంద‌రు వైఎస్ షర్మిళ‌కు స‌పోర్ట్ చేస్తున్నారు. ఈసారి జ‌గ‌న్ ఓడిపోతే మాత్రం చాలా మంది నేత‌లు ఇత‌ర పార్టీలోకి జంప్ అవ్వ‌డం ఖాయ‌మ‌నే చెప్పాలి.